సభలో జగన్ బాంబులేస్తారని భయం: బొజ్జల, సాక్షిపై
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు కలిసి శాసన సభలోను బాంబులు వేస్తారేమోనని భయం వేస్తోందని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి శనివారం ఎద్దేవా చేశారు. శాసన సభ లాబీల్లో ఆయన మాట్లాడారు.
బయట బాంబులు వేశారని, నాయకుల పైన బాంబులు వేయించారని, ఇక సభలోను వేస్తారేమోనని భయంగా ఉందని ఆయన అన్నారు. హత్యలు చేసేవారెవరో, రౌడీలు ఎవరో ప్రజలకు బాగా తెలుసునని, దాని పైన కొత్తగా చర్చ అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలోని శాంతిభద్రతల పైన ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు మాట్లాడుతూ.. పొలం గట్టు గొడవల్లో మరణించిన వారిని ప్రభుత్వ హత్యలుగా రాసిన సాక్షి పత్రికలో నిజాలున్నట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. రాజానగరంలో మద్యం ఎక్కువగా సేవించి చనిపోయిన వ్యక్తిది రాజకీయ హత్య అంటూ సాక్షి పత్రికలో తప్పుడు కథనాలు రాశారని రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అన్నారు.