మోడీతో ఢీ: ప్రధాని బరిలో కేజ్రీవాల్, బలం చూశాకే
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు దఫాలుగా ఢిల్లీని ఏలిన కాంగ్రెసు పార్టీని, ముఖ్యమంత్రిగా ఉన్న షీలా దీక్షిత్ను ఎఎపి, కేజ్రీవాల్ మట్టికరిపించారు.
రానున్న 2014 ఎన్నికల్లో ఎఎపి దేశవ్యాప్తంగా అన్ని స్థానాలలో కాకపోయినప్పటికీ, ఎక్కువ స్థానాలలో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎఎపి తరఫున ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యక్తిగతంగా కేజ్రీవాల్ తిరస్కరించినా, పార్టీ నేతలు మాత్రం ఇందుకు అవకాశం ఉంటుందంటున్నారు.
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయరాదని కేజ్రీవాల్ వ్యక్తిగతంగా కోరుకుంటున్నారని అయితే, ముందుగా బలాన్ని అంచనా వేసి, తర్వాత ఈ విషయంపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఎఎపి విధాన సలహా కమిటీ సభ్యులు యోగేంద్ర యాదవ్ చెప్పారు.
ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీలకు ఒక స్పష్టమైన ప్రత్యామ్నాయాన్ని పార్టీ చూపించాల్సి ఉంటుందని అన్నారు. యోగేంద్ర అభిప్రాయాలతో పార్టీలోని పలువురు నేతలు కూడా ఏకీభవిస్తున్నారు. ఈ విషయంపై జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని, అయితే ఇందుకు అవకాశాన్ని మాత్రం ఓపెన్గానే ఉంచాలని నిర్ణయించామని చెప్పారు.