ముంబై దాడి టెర్రరిస్ట్ రాజభోగం: జైల్లోనే భార్యతో...
రావల్పిండి: 26/11 ముంబై దాడులకు తెగబడ్డ లష్కరే తోయిబా ఆపరేషన్ చీఫ్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీని పాకిస్తాన్లోని రావల్పిండి జైలులో వీవీఐపీగా ట్రీట్ చేస్తున్నారట. 2009 నుంచి పాకిస్తానీ నగరం రావిల్పిండిలోని అడియాల జైలలో బందీ అయ్యాడు.
అయినా జైలులో ఉండగానే 2010లో తన చిన్న భార్యతో కాపురం చేసి ఓ బిడ్డకు జన్మనిచ్చాడు. పాకిస్తాన్ జైలు అధికారులు అతనికి ఆ స్థాయిలో సహకరించారట. అతడు యథేచ్ఛగా వినిగియోగిస్తున్న సెల్ఫోన్ సౌకర్యాన్ని తొలగించాలన్న అమెరికా అభ్యర్థనను ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ నిర్ద్వందంగా తిరస్కరించింది.
దీంతో లఖ్వీ నిర్బంధం పేరుకు మాత్రమేనని భారత్కు అర్థమైందంటున్నారు. భారత వాణిజ్య రాజధాని ముంబైలో దాడులు లఖ్వీ కనుసన్నల్లోనే జరిగాయన్న ఆరోపణలతో పాకిస్తాన్ అతడిని అరెస్ట్ చేసింది.
భారత్తో పాటు అంతర్జాతీయ సమాజం దృష్టిలో అతడిని అరెస్ట్ చేసినట్లుగా చూపిన పాక్, ఉగ్రవాద కార్యకలాపాలను నిర్విఘ్నంగా కొనసాగించేందుకు మాత్రం అతడికి వెన్నుదన్నుగా నిలుస్తోందట. జైలుకు నిత్యం ఉగ్రవాద మూకలతో లఖ్వీ భేటీలు నిర్వహించేందుకు అధికారులు సహకరిస్తున్నారు.