పవన్కు చిరు నో: మెగా బ్రదర్స్ అదృష్టం రివర్స్!
హైదరాబాద్: మెగా సోదరులకు అదృష్టం తిరగబడింది! నిన్నటి వరకు చిరంజీవి కేంద్రమంత్రి. ఆయన హైదరాబాదులో ఉంటే నిత్యం ఆయన ఇళ్లు నేతలు, అభిమానులు తదితరులతో కళకళలాడేది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద అంత సందడి కనిపించకపోయేది. అయితే నిన్నటి సార్వత్రిక ఎన్నికలు ఇద్దరి అదృష్టాన్ని తారుమారు చేశాయి!
ఇప్పుడు చిరంజీవి నివాసం పూర్తిగా కళావిహీనం కాగా పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద నేతల సందడి కనిపిస్తోంది. టిడిపి, బిజెపి పార్టీల నుండి గెలుపొందిన పలువురు ప్రజాప్రతినిధులు ఆయనను కలిసి అభినందనలు తెలిపేందుకు వరుస కడుతున్నారు.
మెగా సోదరులు ఇద్దరు కూడా సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. సీమాంధ్రలో పవన్ కళ్యాణ్ టిడిపి, బిజెపి పార్టీల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు సీమాంధ్రలో టిడిపి అధికారంలోకి రావడంతో ఆయన వద్దకు ముఖ్య నేతలు తరలి వస్తున్నారు. బిజెపి అగ్రనేతలు కూడా పవన్ కళ్యాణ్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయనను ఎన్డీయే సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. టిడిపి గెలుపొందిన తర్వాత పవన్ను చంద్రబాబు లంచ్కి ఆహ్వానించారు.
రెండు మూడురోజులుగా పవన్ కళ్యాణ్ను కలుస్తున్నారు. మురళీ మోహన్, మాగంటి బాబు, కంభంపాటి హరిబాబు వంటి పలువురు నాయకులు కలిశారు. టిడిపి, బిజెపి గెలుపులో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉందని వారు చెబుతున్నారు.
అయితే పవన్ అన్నయ్య చిరంజీవి మాత్రం టిడిపి క్రెడిట్ను తన సోదరుడికి ఇవ్వడం లేదు. సోమవారం చిరంజీవి మాట్లాడుతూ... కాంగ్రెసు ఓటమికి పవన్ కారణం కాదని, అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెసు పార్టీ వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. తాము పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు.