తెలంగాణ ఆపరేషన్: వారిద్దరు కౌగలించుకున్నారు
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసిన వెంటనే కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్ ఆనందం చెప్పనలవి కాకుండా ఉంది. వారిద్దరు ఉబ్బితబ్బిబ్బయ్యారు. బిల్లు ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించిన వెంటనే వారిద్దరూ పరస్పరం ఆలిగనం చేసుకుంటూ దిగ్విజయంగా పనిని పూర్తి చేశామంటూ అభినందించుకున్నారు.
రాజ్యసభలో తమ ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. గొప్ప విజయం సాధించినట్లుగా వారు హావభావాలను ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు కేంద్ర మంత్రి చిదంబరంతో కలిసి వీరిద్దరే మూలస్తంభాలుగా నిలిచిన సంగతి తెల్సిందే.
బిల్లు పార్లమెంటుకు వచ్చినప్పటి నుంచి వీరు మరింతగా వివిధ పార్టీలతో చర్చల్లో మునిగితేలారు. బిల్లు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆమోదం పొందడానికి వ్యూహాలు రచంచి అమలు చేశారు. తెలంగాణ బిల్లు ఆమోదానికి ఏర్పడిన ఆటంకాలతో ఒక సందర్భంలో జైరాం టెన్షన్ తట్టుకోలేక తల పట్టుకున్నారు.
తెలంగాణ బిల్లును ఆమోదిస్తున్నట్లు రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించిన వెంటనే - "అయిపోయిందీ.. థ్యాంక్యూ సార్ థ్యాంక్యూ'' అంటూ షిండే ఆనందం వ్యక్తం చేశారు. అప్పటి వరకు ఆందోళనగా ఉన్న జైరాం ఎంతో భారం దిగిపోయినట్లుగా ఫీలయ్యారు.