మాది అతివిశ్వాసమని సభలో జగన్, పవన్ నో!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమ అవిశ్వాసం వల్లనే తాము ఈ ఎన్నికల్లో ఓడిపోయామని వ్యాఖ్యానించారు. ఆయన అసెంబ్లీలో సోమవారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీని అతివిశ్వాసమే కొంపముంచిందనే వాదన మొదటి నుండి ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆయా జిల్లాల్లో సమీక్షలు కూడా జరిపారు. ఈ సమయంలో కూడా అతివిశ్వాసం విషయం చర్చకు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి.

అయితే, ఇప్పుడు జగన్ సాక్షాత్తు సభలోనే అతివిశ్వాసం అని చెప్పడం గమనార్హం. తమ అతివిశ్వాసమే తమ కొంప ముంచి ఉండవచ్చునని చెప్పారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఇచ్చిన హామీలు, ప్రధాని నరేంద్ర మోడీ హవా కారణమనిచెప్పారు.
కాగా, తెలుగుదేశం పార్టీ గెలుపులో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా ఉందని స్వయంగా టిడిపి, బిజెపి కూడా చెబుతోంది. ఈ విషయం అంతర్గత సమావేశాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే సభలో చంద్రబాబు హామీలు, మోడీ పేరును మాత్రమే జగన్ ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications