నితీష్ ఫ్రెండ్స్ వ్యాఖ్యలు: గోవుపై బిజెపి ప్రకటన, రగడ
పాట్నా: బీహార్లో చివరిది, ఐదో దశ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఓ ప్రకటన పైన విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గురువారం తొమ్మిది జిల్లాల్లోని మొత్తం 57 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికకు ముందు బిజెపి ఓ పత్రికా ప్రకటన ఇచ్చింది.
ఓ మహిళ గోవును కౌగిలించుకొని ఉన్నట్లుగా ఈ ప్రకటన ఉంది. విపక్ష నేతలకు కొన్ని ప్రశ్నలు వేశారు. గోమాతను కించపరుస్తూ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సహా పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎందుకు మౌనంగా ఉన్నారని బిజెపి అందులో ప్రశ్నించింది.
గోమాంసం పైన నితీష్ స్నేహితులు లాలూ, ఆర్జేడీ ఉపాధ్యక్షుడు రఘువంశ్ ప్రసాద్ సింగ్, కర్నాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మౌనాన్ని అందులో ప్రశ్నించారు. ఐదో దశ ఎన్నికలు జరగనున్న కిషన్ గంజ్, సహర్స తదితర ప్రాంతాల్లో స్థానిక వార్తా పత్రికల్లో అది ప్రచురితమైంది.
హిందువులు కూడా గోమాంసాన్ని తింటారని లాలూ, ప్రాచీనకాలంలో మునులు గోమాంసం తినేవారని వేదాలు, పురాణాల్లో ఉందంటూ రఘువంశ్, తాను గోమాంసం తినాలని భావిస్తే తనను ఎవరూ అడ్డుకోలేరని సిద్ధరామయ్య ఇటీవల వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో వారి ప్రశ్నలకు నితీష్ మౌనం ఏమిటని ప్రశ్నిస్తూ... గోవును ఆలింగనం చేసుకున్న ఓ మహిళ ఫోటోను ముద్రించింది బిజెపి. లాలూ, రఘువంశ్, సిద్దరామయ్య వ్యాఖ్యలను ఉటంకించింది. ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని.. స్నేహితుల వ్యాఖ్యలతో ఏకీభవిస్తన్నారో, లేదా నితీష్ చెప్పాలని ప్రశ్నించింది. సమాధానం లేకుంటే ఓట్లు రావని పేర్కొంది.
దీనిపై మహాకూటమి (ఆర్జేడీ, జేడీయు, కాంగ్రెస్) మండిపడింది. ఓటర్లను విభజించేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోందని, ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలని ఈసిని కోరింది.
దీనిపై బిజెపి కూడా ఘాటుగానే స్పందించింది. మేం చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని పేర్కొంది. పార్టీ బిహార్ నేత సుశీల్ కుమార్ మోడీ మాట్లాడుతూ.. గోమాంసం ప్రకటనలో తప్పులేదని, ఈ అంశాన్ని తొలుత లేవనెత్తింది మేం కాదని, లాలూనే అని, మేం స్పందించామని వివరణ ఇచ్చారు.
ఇదిలా ఉండగా, వార్తాపత్రికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎలాంటి ప్రకటనలు ప్రచురించకూడదంటూ ఈసీ నియంత్రణలు విధించింది. ముద్రణా ప్రసార మాధ్యమాలలో ప్రకటనలపై ఈసీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.