చేసుకున్నవారికి చేసుకున్నంత: ధోనీకి హైకోర్టు అక్షింతలు
బెంగళూరు: చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవా అన్నారు. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ చేసిన తప్పునకు అక్షింతలు పడాల్సి వచ్చింది. హిందూ దేవుడిని కించపరిచే విధంగా ఓ వాణిజ్య ప్రకటన చిత్రంలో పోజిచ్చాడనే కేసులో టీమిండియా వన్డే కెప్టెన్ ధోనీపై కర్ణాటక హైకోర్టు మంగళవారంనాడు మండిపడింది.
డబ్బుల కోసం అలాంటి ప్రకటనల్లో నటించే ముందు జరిగే పరిణామాల గురించీ తెలిసి ఉండాలని మొట్టికాయలు వేసింది. ఇలాంటి సెలబ్రిటీలు బాధ్యత లేకుండా ప్రకటనల ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. వారి లక్ష్యం సులువుగా డబ్బులు సంపాదించడమే గానీ పర్యవసనాల గురించి ఆలోచించడం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
విష్ణుమూర్తి అవతారంలో వివిధ కంపెనీల ఉత్పత్తులతో పాటు, బూట్లు కూడా చేబూని ఉన్న ధోనీ ఫొటో అప్పట్లో ఓ మ్యాగజైన్ కవర్పై ప్రచురించారు. ఇది హిందువుల మనోభావాలను కించపరచడమే అని సామాజిక కార్యకర్త జయకుమార్ హిరేమత్ ధోనీపై కోర్టులో కేసు వేసిన సంగ తి తెలిసిందే. కేసులో ఇరు పక్షాల వాదనలు వి న్న కోర్టు తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.
దానికి మహేంద్ర సింగ్ ధోనీ డబ్బులు తీసుకోలేదని ధోనీ తరఫు న్యాయవాది చెప్పారు. మ్యాగజైన్ కవర్ పేజీ మీద చిత్రం ముద్రించినందుకు తాను ఏ విధమైన డబ్బులు తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ గౌడ ధోనీని ఆదేశించారు.