జెసి దివాకర్ రెడ్డితో భేటీకి నారా లోకేష్ నో?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి విషయంలో ఓ పుకారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షికార్లు చేస్తోంది. అందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు గానీ ప్రచారం మాత్రం ముమ్మరంగానే సాగుతోంది. జెసి దివాకర్ రెడ్డిని కలవడానికి తెలుగుదేశం పార్టీ యువ నేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ నిరాకరించారనేది ఆ ప్రచారం.
జెసి దివాకర్ రెడ్డి రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తారనే విషయం తెలిసిందే. ఆయనకు లోపల దాచుకోవడం తెలియదు. ఉన్నదంతా చెప్పేస్తారు. రాజకీయాల్లో బయటకు చెప్పకూడని విషయాలు ఉంటాయనేది ఆయనకు పట్టదు. ఈ స్థితిలోనే ఆయన ప్రత్యేక హోదా విషయంలోనే కాకుండా ఇతర విషయాల్లో కూడా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు.
అయితే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పైకి నారా చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నప్పటికీ లోపలంతా కథనంతా నడిపిస్తోంది నారా లోకేషేనని అంటున్నారు. దీంతో సీనియర్ పార్టీ నాయకులు, మంత్రులు కూడా లోకేష్ను కలుసుకోక తప్పడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జెసి దివాకర్ రెడ్డి నారా లోకేష్ను కలవడానికి ప్రయత్నించారట. అయితే, ఆయనతో భేటీకి నారా లోకేష్ అంగీకరించలేదని అంటున్నారు.
నిజానికి, జెసి దివాకర్ రెడ్డి మనస్తత్వం తెలుగుదేశం పార్టీలో ఒదిగేది కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జెసి దివాకర్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం చంద్రబాబుకు తప్పలేదు, తెలుగుదేశం పార్టీలో చేరడం జెసి దివాకర్ రెడ్డికి తప్పలేదు. జెసి దివాకర్ రెడ్డితో బద్ధ వైరం ఉన్న ప్రస్తుత మంత్రి పరిటాల సునీతను కూడా చంద్రబాబు ఒప్పించి, ఆయనను పార్టీలో చేర్చుకున్నారు. అది అనివార్యంగా మారింది. ఏమైనా, జెసి దివాకర్ రెడ్డిది రాజకీయాల్లో తనదైన శైలే.