సస్పెన్షన్: రోజాకు బాసటగా విష్ణుకుమార్ రాజు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అన్ని విధాలా అండగా నిలబడుతూ వస్తున్న బిజెపి సభ్యుడు విష్ణుకుమార్ రాజు ఆశ్చర్యకరంగా సస్పెన్షన్కు గురైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యురాలు రోజాకు మద్దతుగా మాట్లాడారు. రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేయడం బాధాకరమని ఆయన అన్నారు.
సస్పెన్షన్ను ఈ సమావేశాల వరకే పరిమితం చేస్తే బాగుంటుందని సభాపతికి ఆయన శనివారంనాడు సభలో విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే సభలో ప్రతిపక్ష సభ్యులు ఉండే అవకాశమే లేదన్నారు. విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలను శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యతిరేకించారు.
కాగా, కాల్మనీ తీవ్ర విషవృక్షంగా మారిందని, కాల్మనీ విషవృక్షాన్ని బయటకు తీయాల్సిన అవసరం ఉందని విష్ణుకుమార్ రాజు అన్నారు. ఏపీ శాసనసభ సమావేశాలు మూడో రోజు ప్రారంభం కాగానే విష్ణుకుమార్ రాజు మాట్లాడారు.
కాల్మనీ అంశంపై తనకు 10నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పించాలని సభాపతిని కోరారు. కాల్మనీపై చర్చ ముగిసిందని మరో సందర్భంలో మాట్లాడవచ్చని సభాపతి సూచించారు.