ఫోటో స్టోరీ: బిచ్చగాళ్లకు డబ్బులు ఇవ్వొద్దు
హైదరాబాద్: హైదరబాద్ నగరాన్ని యాచక రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 23న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నగరంలోని అన్ని స్వచ్చంధ సంస్ధల ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ, పోలీసులతో పాటు సంబంధిత విభాగాల అధికారులు పాల్గొంటారని ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీఓస్ ఫర్ బెగ్గర్స్ ఫ్రీ సొసైటీ ఛైర్మన్ డాక్టర్ జి.రామయ్య తెలిపారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అన్ని విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని తెలిపారు.
నగరంలోని వివిధ కూడళ్లలో యాచకవృత్తి నివారణ ప్రచారోద్యమం, నిజమైన యాచకులకు పునరావాస కార్యక్రమాలు, యాచకులకు డబ్బులు దానం చేయకుండా నగర పౌరుల్లో అవగాహన కల్పించడం తదితర విషయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో పాల్గొనే స్వచ్చంధ సంస్ధలు 9908111355, 9866289793, 9441256545 నెంబర్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని లేదా [email protected] మెయిల్కు వివరాలను పంపించాలని సూచించారు.
హైదరబాద్ మహానగరంలో దాదాపు 14 వేల మంది యాచకులు ఉన్నట్లు ఈ సంస్ధ నిర్వహించిన సర్వేలో తేలింది. నగరంలోని ఈ 14వేల మందికి ప్రతి ఏటా రూ. 24 కోట్లను నగర పౌరులు దానం చేస్తున్నట్టు మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.