అమ్మ మనసు పెడితే..! అప్పట్లో ఆమె 'డ్యాన్స్'.. ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్న జనం
మైసూర్ : జయలలిత ఏంటి.. డ్యాన్స్ షో ఏంటి అనుకుంటున్నారా..! ఆశ్చర్యపోవాల్సిందేమి లేదు, ఎందుకంటే ఇది ఇప్పటి మాట కాదు. టీనేజర్ గా జయలలిత, సినిమాల్లో తనదైన ముద్ర వేస్తోన్న రోజుల్లో జరిగిన విషయమిది.
కర్ణాటకలోని నాగువినహళ్లి అనే గ్రామంలో పాఠశాల నిర్మాణం కోసమై సేవా దృక్పథంతో అప్పట్లో తన అధ్బుతమైన ప్రదర్శనతో అలరించారు జయలలిత. జయలలిత చేసిన అప్పటి సహాయానికి ఇప్పటికీ కృతజ్ఞతా భావంతో వ్యవహరిస్తున్నారు అక్కడి నాగువినహళ్లి గ్రామస్తులు.
కావేరి జలాల విషయంలో కర్ణాటక ప్రజలు ఇప్పటికీ తమిళ నేతలను వ్యతిరేకించే పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లోంచి ఒక్క అమ్మకు మాత్రమే నాగువినహళ్లి ప్రజలు ఎందుకు మినహాయింపు ఇచ్చారో తెలియాలంటే, ఒక్కసారి గతంలోకి వెళ్లి రావాల్సిందే. 19 ఏళ్ల వయసులో జయలలిత సినిమాల్లో కొనసాగుతోన్న రోజులవి. ఆ సమయంలో తమ గ్రామంలో పాఠశాల నిర్మాణం నిమిత్తమై జయలలితను నాగువినహళ్లి గ్రామస్తులు సంప్రదించారు.
గ్రామస్తుల అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించిన జయలలిత, ఇందుకోసం 1967 మార్చి 19 మైసూర్ యూనివర్సిటీలోని క్రాఫర్డ్ హాల్ లో తన సొంత నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసి, దీనికి రూ.10 నుంచి రూ.50 వరకు టికెట్ ధరగా నిర్ణయించారు. జయలలిత షో కావడంతో జనం కూడా కార్యక్రమం పట్ల విపరీతమైన ఆసక్తి కనబర్చారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం షో ద్వారా వచ్చిన డబ్బులను ఆ గ్రామంలో పాఠశాల కోసం విరాళమిచ్చారు.

ఈ చర్యతో గ్రామంలో పాఠశాల నిర్మాణం జరిగి ఎంతోమంది విద్యావంతులయ్యారు. 50 ఏళ్ల కిందట జయలలిత చేసిన ఈ సహాయంతో అప్పటినుంచి ఇప్పటిదాకా అమ్మ మంచి మనసును గుర్తు చేసుకుంటూనే ఉంటారు అక్కడి ప్రజలు. మొన్న జరిగిన తమిళ ఎన్నికల కౌంటింగ్ సమయంలోను అక్కడి ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయి జయలలిత గెలవాలని కోరుకున్నారు.
కాగా, జయలలిత స్వస్థలం కూడా కర్ణాటకనే కావడం గమనార్హం. 1948 లో మైసూరులోని చెలువంబా ఆసుపత్రిలో ఆమె జన్మించారు.












Click it and Unblock the Notifications