రాహుల్ గాంధీని ప్రధానిని చేసిన దిగ్విజయ్ సింగ్!
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని దిగ్విజయ్ సింగ్ ఏకంగా ప్రధానినే చేసేశారు. ఆయన మంత్రివర్గంలో ఫలానా వ్యక్తి పని చేశారంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. వయసు ప్రభావమో లేక జ్ఞాపకశక్తి లోపించడమో
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్కు పొరపాటు వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత సర్దుకోవడం అలవాటే. గతంలో పీవోకే(పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్)ను భారత ఆక్రమిత కాశ్మీర్గా వ్యాఖ్యానించారు. తర్వాత తన తప్పును దిద్దుకున్నారు. ఆ తర్వాత ఉగ్ర నేత ఒసామా బిన్ లాడెన్ను ఒసామాజీ అంటూ గౌరవపూర్వకంగా వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు. తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేశారు.
రాహుల్ గాంధీని ప్రధాని చేసేశారు..
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని దిగ్విజయ్ సింగ్ ఏకంగా ప్రధానినే చేసేశారు. ఆయన మంత్రివర్గంలో ఫలానా వ్యక్తి పని చేశారంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. వయసు ప్రభావమో లేక జ్ఞాపకశక్తి లోపించడమో గానీ, ఆయన ఈ మేరకు ట్విట్టర్లో పోస్టు చేశారు.
నెటిజన్లు
ఈ పోస్టును చూసిన పలువురు నెటిజన్లు వ్యంగ్య స్పందిస్తూ రీట్వీట్లు చేస్తున్నారు. మాజీ ఎంపీ రాజ్కుమారీ రత్నాసింగ్ రూపొందించిన ఓ వీడియోను దిగ్విజయ్ సింగ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ వీడియో తీసింది ఎవరో వివరించే ప్రయత్నంలో ఆయన పలు తప్పులు చేశారు.
రాహుల్ మంత్రివర్గంలో..
రత్నాసింగ్ ఎవరో కాదని.. మాజీ మంత్రి దినేష్ సింగ్ కూతురని చెప్పారు. అంతటితో ఆగకుండా దినేష్ సింగ్ గతంలో ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ మంత్రివర్గంలో పని చేశారని వ్యాఖ్యానించారు.
రాహుల్ ప్రధాని ఎప్పుడు?
దినేష్ సింగ్ తండ్రి అవధ్ తాలూక్దార్లలో ఒకరని, ఆయన స్వాతంత్ర్య సమరంలో బ్రిటిష్ వారితో పోరాడి కాంగ్రెస్కు మద్దతిచ్చారని కూడా పేర్కొన్నారు. అయితే, ఇందిరా గాంధీ అంటే ప్రధానిమంత్రిగా పనిచేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే గానీ, రాహుల్ గాంధీ ఎప్పుడు ప్రధాని అయ్యారో.. ఆయన దగ్గర దినేష్ సింగ్ మంత్రిగా ఎప్పుడో పని చేశారో దిగ్విజయ్ సింగ్కే తెలియాలంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.
రాజీవ్ బదులు రాహుల్..
అయితే, రాజీవ్ గాంధీ పేరు బదులు రాహుల్ గాంధీ పేరును దిగ్విజయ్ సింగ్ రాసివుంటారని పలువురు అంటున్నారు. కాగా, కాసేపటికే దిగ్విజయ్ సింగ్ ఈ ట్వీట్ను తొలగించినట్లు తెలుస్తోంది.