ఎన్నికల వేళ: వైఎస్ జగన్ కోసం అతనొచ్చాడు
వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్ కోసం ప్రశాంత్ కిశోర్ పనిచేసే అవకాశాలున్నాయి. ఆయన విజయసాయి రెడ్డితో సమావేశమయ్యారు.
హైదరాబాద్: రాజకీయ వ్యూహకర్తగా, ఎన్నికల్లో గెలిపించే పథక రచయితగా ప్రశాంత్ కిశోర్ పేరు ఇటీవల మారుమోగి పోతున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు సేవలందించడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ కిశోర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కొత్త ప్రచార పంథాను రూపొందిస్తారని అంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన శనివారంనాడు హైదరాబాద్ వచ్చారు. అందులోనూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి నివాసంలో బస చేశారు.
ఎన్నికల ప్రచార గ్రూప్ అయిన సిటిజన్స్ ఫర్ అకౌంటేబుల్ గవర్నెన్స్ (సిఎజి)ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రశాంత్ కిశోర్ పేరు దేశంలో మారుమోగిపోవడం ప్రారంభమైదంి.
లోకసభ ఎన్నికల్లో బిజెపికి..
ప్రశాంత్ కిశోర్ 2014 లోకసభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపికి పనిచేశారు. ఆయన వ్యూహరచన కారణంగానే మోడీ నాయకత్వంలోని బిజెపి తిరుగులేని మెజారిటీ సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందనే మాట కాదనలేని పరిస్థితి ఏర్పడింది.
బిహార్లో నితీష్ కుమార్ కోసం పని చేశారు...
లోకసభ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిన తర్వాత బీహార్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. అప్పటికి నితీష్ కుమార్ అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో నితీష్ కుమార్ ప్రశాంత్ కిశోర్ సహాయం తీసుకున్నాడు. ఈ కారణంగానే నితీష్ కుమార్ తిరిగి అధికారంలోకి వచ్చారని అంటారు. నితీష్ అధికారంలోకి రావడమే కాకుండా బిజెపి తుడిచిపెట్టుకు పోయింది.
విజయసాయి ఇలా...
ప్రశాంత్ కిశోర్ కొద్ది కాలంగా తనకు మంచి మిత్రుడని, తన వ్యక్తిగత ఆహ్వానం మేరకు తన వద్దకు వచ్చాడని విజయసాయి రెడ్డి చెప్పినట్లు దక్కన్ క్రానికల్ రాసింది. తాము పలు విషయాల గురించి చర్చించుకున్నట్లు, అయితే ప్రశాంత్ కిశోర్ సేవలను వైసిపి ఉపయోగించుకునే విషయంలో నిర్ణయమేదీ తీసుకోలేదని ఆయన చెప్పారు.
పూర్తిగా అది వ్యక్తిగతమే...
ప్రశాంత్ కిశోర్ తన నివాసానికి రావడం పూర్తిగా వ్యక్తిగతమైందని విజయసాయి రెడ్డి చెప్పినట్లు కూడా దక్కన్ క్రానికల్ రాసింది. వైయస్ జగన్ను సంప్రదించిన తర్వాతనే ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకోవాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుుకుంటామని ఆయన అన్నారు. విజయసాయి రెడ్డి కిశోర్ను కలుసుకోవడం ఇదే మొదటిసారి కాదని, గతంలో ఢిల్లీలో వారిద్దరి మధ్య సమావేశాలు జరిగాయని అంటున్నారు.