ఇదొక్కటి చాలు: ఉ.కొరియాలో ప్రజల దుస్థితి చెప్పడానికి, ఆఖరికి చావులోను..
ఉత్తరకొరియా నుంచి పారిపోయి వచ్చి దక్షిణ కొరియాలో ఆశ్రయం పొందుతున్న ముగ్గురు శరణార్థులు తాజాగా అక్కడి పరిస్థితులపై స్పందించారు.
Recommended Video

ప్యోంగ్యాంగ్: ఉత్తరకొరియాలో ప్రజల స్వేచ్చా హక్కులను కాలరాస్తున్న ఘటనలు.. వాటికి సంబంధించిన కథనాలు ఇటీవలి కాలంలో చాలానే వెలుగుచూశాయి.
అమెరికాను ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఢీకొట్టాలనుకోవడం తప్పా.. ఒప్పా.. అన్న సంగతి పక్కనబెడితే.. అక్కడి ప్రజల దుర్భర జీవితంపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది.
కిమ్ ఆకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఉత్తరకొరియా నుంచి దక్షిణకొరియాకు పారిపోవాలని చూసేవాళ్ల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఇటీవలి కాలంలో ఓ సైనికుడు ఉత్తరకొరియా సైన్యం నుంచి తప్పించుకుని దక్షిణకొరియా లోకి పారిపోవడం అందరికీ తెలిసిందే.
గతంలో అక్కడి నుంచి పారిపోయి దక్షిణకొరియాలో ఆశ్రయం పొందుతున్న బాధితులు ఆ దేశంలోని పరిస్థితులపై ఇప్పుడిప్పుడే నోరు విప్పుతున్నారు.

ఈ ఒక్కటి చాలు:
ఉత్తరకొరియా నుంచి పారిపోయి వచ్చి దక్షిణ కొరియాలో ఆశ్రయం పొందుతున్న ముగ్గురు శరణార్థులు తాజాగా అక్కడి పరిస్థితులపై స్పందించారు.
శరణార్థురాల్లో ఒకరు మాట్లాడుతూ.. ' మా ఇల్లు రైలు ట్రాక్ పక్కనే ఉండేది. అది ఎప్పుడూ చాలా శుభ్రంగా ఉండేది. ట్రాక్పై ఉన్న ప్రతీ రాయిని బయటకు తీసి శుభ్రపరిచి తిరిగి అక్కడ పెట్టేవాళ్లు' అని ఆమె చెప్పుకొచ్చారు.
అధ్యక్షుడి మెప్పు పొందడానికి ఇలాంటి పనులన్ని తమపై బలవంతంగా రుద్దేవాళ్లని ఆమె వాపోయారు. ఈ ఒక్క ఘటన చాలు ఉత్తరకొరియాలో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడానికి.

కిమ్ రావొద్దనే:
తాము పనిచేసే ప్రదేశాలకు కిమ్ ఎప్పుడూ రావద్దని కోరుకునేవాళ్లమని ఒక శరణార్థి పేర్కొనడం గమనార్హం. కిమ్ వస్తున్నాడంటేనే తాము హడలెత్తిపోయేవాళ్లమని చెప్పుకొచ్చారు. 'నిజాయితీగా చెప్పాలంటే, కిమ్ Il-సంగ్, కిమ్ జాంగ్-ఇల్ రావాలని మేమెప్పుడూ కోరుకోలేదు' అన్నారు.
'వాళ్లు వస్తేనే మాకు ఎక్కడలేని ఇబ్బందులు ఎదురయ్యేవి. వాళ్లు రాకపోవడమే మాకు లభించే అతిపెద్ద సహాయం అని భావించేవాళ్లం' అని చెప్పారు.

గూఢచారులా?:
శరణార్థులుగా పారిపోయి వచ్చిన తమను చాలామంది.. 'మీరు గూఢచారులా?' అని ప్రశ్నించినట్టు తెలిపారు. దక్షిణకొరియాలో ఎప్పుడైనా గూఢచారులు పట్టుబడినట్టు వార్తలు వస్తే.. ఇక్కడి ప్రజలు సరదాగా మమ్మల్ని కూడా గూఢచారులు అని పిలుస్తారని మరో శరణార్థి పేర్కొన్నాడు.

చావులోను అదే పేరు తలుస్తారు:
ఉత్తరకొరియా ప్రజలు ఆఖరికి చావులోను కిమ్ పేరునే తలుచుకుంటున్నారని శరణార్థి ఒకరు ఎద్దేవా చేశారు. 'హెయిల్ గ్రేట్ లీడర్ కిమ్ Il-సంగ్' లేదా 'హెయిల్ కొరియన్ వర్కర్స్ పార్టీ' అంటూ నినాదాలు చేస్తారని వ్యాఖ్యానించారు. దీనిపై మరో శరణార్థి స్పందిస్తూ.. 'ప్రతీ భద్రతా దళం ఈ నినాదాన్ని తప్పకుండా చేస్తుంది' అని తెలిపాడు.












Click it and Unblock the Notifications