మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి రీ ఎంట్రీ: బీజేపీ ఒక్క చాన్స్, రెబల్స్ దెబ్బ, ఏం చేస్తారు!
బళ్లారి/ బెంగళూరు: కర్ణాటక పర్యాటక శాఖ మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో మళ్లీ క్రియాశీలకంగా మారాలని తహతహలాడుతున్నారు. 2018లో కర్ణాటకలో జరిగే శాసన సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని గాలి జనార్దన్ రెడ్డి ప్రత్యక్షంగానే సంకేతాలు ఇచ్చారు. బెంగళూరు గ్రామీణ జిల్లా అనేకల్ పట్టణంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న గాలి జనార్దన్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఒక్క చాన్స్ ఇవ్వండి
బీజేపీ నాయకులు తనకు ఒక్క చాన్స్ ఇస్తే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తానని, శాసన సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తధ్యమని, రైతుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశామని, ఇక ముందు పార్టీ కోసం పని చేయ్యడానికి తాను సిద్దంగా ఉన్నానని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు.

కాంగ్రెస్ పై వ్యతిరేకత !
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెరిగిపోయిందని, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. మైసూరులోని శ్రీ చాముండేశ్వరీ ఆలయంలోకి సిద్ధరామయ్య పాదరక్షలు వేసుకుని వెళ్లిన విషయం రాష్ట్ర ప్రజలు ఇంకా మరిచిపోలేదని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.

40 కేసులు పెట్టారు
తన మీద 40కి పైగా తప్పుడు కేసులు పెట్టిన యూపీఏ ప్రభుత్వం తన జీవితాన్ని సర్వనాశనం చెయ్యడానికి ప్రయత్నించిందని, అయితే దేవుడు, ప్రజలు తన వైపు ఉన్నారని, తప్పకుండా న్యాయం గెలుస్తుందని గాలి జానర్దన్ రెడ్డి వివరించారు.

మాజీ సీఎం క్లారిలీ
ఇటీవల బళ్లారిలో బీజేపీ పరివర్తనా ర్యాలీ సందర్బంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో లేరని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయనకు హైకమాండ్ అనుమతి ఇవ్వాలని క్లారిటీ ఇచ్చారు.

సుప్రీం కోర్టు ఆదేశాలు
అక్రమ గనుల కేసుల్లో జైలుకు వెళ్లిన గాలి జనార్దన్ రెడ్డి 2015లో సుప్రీం కోర్టులో బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బళ్లారిలో అడుగు పెట్టరాదని సుప్రీం కోర్టు ఆదేశించడంతో గాలి జనార్దన్ రెడ్డి ఆ జిల్లా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

గాలి దెబ్బతో !
2013లో కర్ణాటకలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి కంచుకోటగా ఉన్న బళ్లారిలో ఆ పార్టీకి భారీ దెబ్బపడింది. బళ్లారి జిల్లాలోని 9 శాసన సభ నియోజక వర్గాల్లో ఐదు కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. మిగిలిన నాలుగు స్థానాల్లో బీజేపీ, బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్, స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నలుగురు విజయం సాధించారు.

గాలి, శ్రీరాములు శిష్యుడు
కూడ్లగి నియోజక వర్గంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన బీ. నాగేంద్ర గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములకు శిష్యుడు. బీజేపీ నాయకులు నిర్లక్షం చేశారని రగిలిపోతున్న ఎమ్మెల్యే నాగేంద్ర రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.

మాజీ మంత్రి
జగదీష్ శెట్టర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా పని చేసిన హోస్ పేట్ శాసన సభ్యుడు, గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు ఆనంద్ సింగ్ సైతం బీజేపీ నాయకుల తీరుతో విసిగిపోయారు. బీజేపీ పరివర్తన ర్యాలీకి ఆనంద్ సింగ్, ఆయన అనుచరులు డుమ్మాకొట్టి నిరసన వ్యక్తం చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోవడానికి సిద్దం అయ్యారు.

గాలి తిరుగులేని లీడర్
బళ్లారి జిల్లాను బీజేపీ కంచుకోటగా నిలిపిన గాలి జనార్దన్ రెడ్డికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉందనే విషయం తెలిసిందే. బళ్లారి జిల్లాలో బీజేపీకి పూర్వవైభవం తీసుకురావాలంటే గాలి జనార్దన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాలని ఆయన అభిమానులు అంటున్నారు.

బీజేపీ హైకమాండ్?
అక్రమ గనుల కేసు వ్యవహారం గత శాసన సభ ఎన్నికల్లో బళ్లారిలో బీజేపీని కుదిపేసింది. గాలి జనార్దన్ రెడ్డి మీద కేసులు ఇప్పటికీ విచారణలో ఉన్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డిని బీజేపీ హైకమాండ్ పార్టీలోకి ఆహ్వానిస్తుందా ? లేదా ? అనే విషయం అర్థంకాక ఆయన అభిమానులు అయోమయంలో పడిపోయారు.












Click it and Unblock the Notifications