దేవీ శరన్నవరాత్రులు: 9 రూపాలలో దర్శనం ఇవ్వనున్న దుర్గాదేవి!!
దసరా నవరాత్రి మహోత్సవాలకు సమయం ఆసన్నమైంది. ఈ సంవత్సరం దేవీ నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 15వ తేదీన నేటినుండి ప్రారంభమవుతున్నాయి. హిందూ పంచాంగం ప్రకారం అశ్వయుజ మాసంలోని శుక్లపక్షం ప్రధమ రోజున దేవి శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. మొత్తం తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు అక్టోబర్ 24వ తేదీన విజయదశమి వేడుకలతో ముగుస్తాయి.
ఈ తొమ్మిది రోజులు పది రాత్రులలో 9 రూపాలలో దుర్గాదేవిని భక్తులు విశేషంగా పూజలు చేస్తారు. నేడు ప్రారంభమవుతున్న దేవి శరన్నవరాత్రులను శరద్ నవరాత్రులని, శరన్నవరాత్రులు అని, శారదీయ నవరాత్రులు అని పిలుస్తారు. ఈ సంవత్సరం శరన్నవరాత్రులలో మొదటి రోజున అమ్మవారి ఆరాధన కోసం కలశాన్ని స్థాపిస్తారు. ఈ కలశాన్ని శక్తి ఆరాధనలో భాగంగా తొమ్మిది రోజులపాటు పూజలు చేస్తారు.

ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీన దేవి శరన్నవరాత్రుల మొదటి రోజు వస్తుంది కాబట్టి, నేడు ఆదివారం నాడు కలశాన్ని స్థాపిస్తారు. కలశ స్థాపనకు ఉదయం 11:44 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు శుభ సమయమని చెబుతున్నారు. ఇక దేవి శరన్నవరాత్రుల క్యాలెండర్ విషయానికి వస్తే తొమ్మిది రోజులు అమ్మవారు తొమ్మిది రూపాలలో భక్తులకు దర్శనం ఇస్తారు.
అక్టోబర్ 15వ తేదీన కలశ స్థాపనతో పాటు శైలి పుత్రిగా అమ్మవారి భక్తులకు దర్శనం ఇస్తారు. అక్టోబర్ 16వ తేదీన బ్రహ్మచారిణి గా భక్తులను కరుణిస్తారు. అక్టోబర్ 17వ తేదీన చంద్రఘంటగా అమ్మవారిని పూజిస్తారు. అక్టోబర్ 18వ తేదీన కూష్మాండిగా అమ్మవారి పూజలు చేస్తారు. అక్టోబర్ 19వ తేదీన స్కందమాత గా అమ్మవారు దర్శనమిస్తారు.
అక్టోబర్ 20వ తేదీన కాత్యాయనిగా అమ్మవారిని పూజిస్తారు. అక్టోబర్ 21వ తేదీన సరస్వతిగా ,కాళరాత్రిగా దర్శనమిస్తారు. అక్టోబర్ 22వ తేదీన దుర్గాష్టమి రోజు, మహాగౌరి పూజను, సంధి పూజను నిర్వహిస్తారు. అక్టోబర్ 23వ తేదీన దుర్గా మహా నవమిని నిర్వహిస్తారు. అక్టోబర్ 24వ తేదీన నవరాత్రి పరణ, దుర్గా నిమజ్జనం తో పాటు విజయదశమి వేడుకలను జరుపుకుంటారు.












Click it and Unblock the Notifications