మనస్సు మారేందుకు కారణమేంటీ ? వాటితోనే మనస్సు చలించిపోతోందా ?
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151
సహజత్వానికీ, అహంకారానికీ మధ్య తేడా అంతా మనసులో జనించే కోరికలోనే ఉంది ! అనుభవం ఒక సహజ పరిణామం. కానీ అనుభవాన్ని ఆకాంక్షించడం, ఆక్షేపించడం అహంకారం. భిన్నత్వం సహజం - బేధంగా కనిపించడం అహంకారం. వైవిధ్యం సహజం - వైరుధ్యంగా అనిపించటం అహంకారం. ఆత్మ వస్తువే ఈశ్వరుడు, జగత్తు, జీవుడిగా వ్యక్తం కావడం సహజం. జగత్ జీవేశ్వరులు వేర్వేరు అన్న బేధభావం కలగటం అహంకారం. సహజత్వానికి, అహంకారానికి మధ్య తేడా అంతా మనసులో జనించే కోరికలోనే ఉంది. కోరిక లేకపోతే అంతా సహజంగా కనిపిస్తుంది. కోరిక జనించినప్పుడే సహజత్వం మరుగున పడుతుంది !
శాంతికి కాపలా ధ్యాస. ఏ పని చేస్తున్నా శాంతి చెదరకుండా ఉండటమే జీవనంలో మనం కొనసాగించాల్సిన నిత్య సాధన. మన శాంతికే కాదు, ఎవరి మనస్సులోని శాంతికీ భంగం కలగకుండా జీవనం సాగించటం ప్రాధమిక సాధన. విచారణ మార్గానికి ప్రత్యేక ఆసనం, భంగిమ, శారీరక ప్రక్రియలు, ప్రత్యేక సమయం ఇలా నియమాలు ఉండవు. మన మనసు, అనుభవాలను నిరంతరం గమనిస్తూ, అవి శాంతికి భంగం కలిగించకుండా మన ధ్యాసను కాపలాగా పెట్టడమే విచారణ మార్గం. అదే మన(సు)కు సాక్షిత్వాన్ని అలవడేలా చేస్తుంది. సాక్షిత్వం అలవడిన మనసులో శాంతి నెలకొంటుంది. శాంతే దేవుడు ! అశాంతే జీవుడు !! శాంతి చెదరటం వల్లనే మనం జీవులుగా ఉన్నాము. శాంతి సంపాదించేది కాదు.
అశాంతిపోతే ఉన్నది శాంతే. మనసుకు పరిపూర్ణమైన శాంతి చేకూరితే మనం దైవంగా ఉంటాము ! బాల్యంలో గుర్తెరిగిన దగ్గర్నుండి ఆరంభమైన నేను అనే భావం మాత్రం మారలేదు ! వయసు పెరిగే కొద్దీ మన రూపం మారుతుంది. మాట మారుతుంది. ఆలోచనలు మారుతాయి. అనుభవాలు మారుతాయి. కానీ మనం గమనిస్తే బాల్యంలో గుర్తెరిగిన దగ్గర్నుండి ఆరంభమైన నేను అనే భావం మాత్రం మారలేదు అని తెలుస్తుంది. నేను ఫలానా అనే భావం మారుతుంది కానీ నేను అనే మూలభావం అలానే ఉంటుంది. మారని నేనుని మార్పు చెందే మనో దేహాలతో కలిపి భావిస్తున్నాం. విచారణ అంటే వాస్తవాన్ని తరచి చూడటం. నేను అని అంటున్నది ఈ దేహాన్నా ? మనసునా ? పేరునా ? హోదానా ? స్థితిగతులనా ? ఇందులో ఎది అసలు నేను ? అని విచారిస్తే అవేవీ లేకుండా కూడా గాఢనిద్రలో 'నేను'గా ఉంటున్నాను ! పైగా అవన్నీ నిరంతరం మారేవి. నేను అనే భావన మాత్రం మారకుండా ఉంటుంది. మరి అవి నేను ఎలా అవుతాను అని అర్ధం అవుతుంది. ఈ రీతిలో మన కళ్ళ ముందే, మన అనుభవంలోనే ఉండే విషయాల్లో నుండి మనకు ఏర్పడిన తప్పు భావాలను వదిలించుకోవటం విచారణ మార్గం.
సత్యదృష్టితో మారేది భావాలే ! అంధుడైన వ్యక్తికి ప్రపంచం, అందున్న ఇతరుల రూపంతోపాటు తన రూపం కూడా తెలియదు. తన రూపం సహా అన్నిటినీ భావాలతో ఊహించుకుంటూ ఉంటాడు. ఆ వ్యక్తికి దృష్టి వచ్చిన తర్వాత వాస్తవ రూపాలు గుర్తిస్తాడు. అప్పుడు తన భావాలకు, వాస్తవాలకు ఎంత వ్యత్యాసం ఉందో అర్థం చేసుకుంటాడు. చూపు వచ్చిన తర్వాతే అద్దంలో ప్రతిబింబం చూసుకొని ఇదా నా రూపం ? అని అనుకుంటాడు. అయితే అప్పటికి, ఇప్పటికీ అతని రూపం మారలేదు. వాస్తవ దృష్టిచేత భావం, అనుభవంగా మారింది. అంతే. అలాగే మనలో విచారణ చేత సత్య దృష్టి ఏర్పడినప్పుడు మనం, ఈ ప్రపంచం, ఈశ్వరుడు ఏవి మారవు. వాటిపట్ల అప్పటివరకు ఉన్న మన భావనలు మారుతాయి అంటే !
ఏ గుణాలు లేని శుద్ధమనసే మహాజపం ! మనసే దుఃఖ పడుతుంది, మనసే సంతోష పడుతుంది కానీ ఈ రెంటిలో ఏవీ ఆ మనసును అంటిపెట్టుకొని ఉండవు. సంతోషమైనా, దుఃఖమైనా జ్ఞాపకంగా తప్ప నిజంగా ఏదీ నిలబడి ఉండదు. అందుకు కారణం ఏమిటంటే.. అసలు మనసుకే ఒక ఉనికి లేకపోవడం ! ఇక మనసుకు ఏర్పడే అనుభవాలకు ఉనికీ, స్థిరత్వం ఎక్కడుంటాయి ? గాఢనిద్రలో మనసు శుద్ధ ఎరుకగా ఉంటుంది. అది దాని స్వరూపం. కానీ మెలకువ రాగానే గుణాలు ఆవహించుకుని స్మృతి చేత అనుభవాలకు విలువను కల్పిస్తాయి. మనసంటే గుణాలు, జ్ఞాపకాలు వాటిని బలోపేతం చేసే ప్రేరకాలు. ఏ గుణాలులేని శుద్ధమనసే మహాజపం. బాహ్య జపం మనసును కమ్ముకున్న గుణాలను తొలగించేందుకు దోహదపడుతుంది. మనలోని శుద్ధమనసు నిరంతరాయంగా అహంబ్రహ్మాస్మి జపం చేస్తూనే ఉంటుంది.