Mahashivaratri: ఈ వ్రతం చేస్తే నిత్యం శివుడు మన చెంతనే ఉంటాడు..!
డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
మహా శివరాత్రి పర్వదినాన్ని నిష్ఠతో ఓ వ్రతంలా చేసుకోవటం పురాణకాలం నుండి వస్తోంది. ఈ వ్రతం చేసేవారి చెంతన నిరంతరం శివుడుంటూ చింతలు తీరుస్తాడు. ఇదే వ్రతాన్ని నిష్కామ దృష్టితో చేసే వారికి ముక్తి లభిస్తుంది. కేవలం మహాశివరాత్రినాడే కాక ఈ వ్రతాన్ని సంవత్సరంలో ప్రతి మాసశివరాత్రి నాడు చేసి ఆ తరువాత ఉద్వాసన విధిని ఆచరించిన వారికి అనంత పుణ్యఫలం లభిస్తుంది. భక్తి , ముక్తి సొంతమవుతాయి. ఇంతటి పుణ్యఫలప్రదమైన ఈ వ్రతాన్ని గురించి చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తూ ఆ శివుడే.
ఓసారి బ్రహ్మ , విష్ణువు , పార్వతీ నేరుగా శివుడినే ఏ వ్రతం చేస్తే మానవులకు శివుడు భక్తిని , ముక్తిని కలిగించటం జరుగుతుందని ప్రశ్నించారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు చేసిన వారికే కాక చూసిన వారికీ , విన్నవారికీ కూడా పాప విముక్తిని కలిగించే శివరాత్రి వ్రతాన్ని గురించి , దాన్ని ఆచరించాల్సిన పద్ధతి గురించి తెలియచెప్పాడు. భక్తిని , ముక్తిని మానవులకు కలిగించే శివ సంబంధ వ్రతాలు చాలా ఉన్నాయి.

ఒకనాడు లింగావిర్భావ కాలమునందు ఒకానొక కల్పంలో బ్రహ్మకి శ్రీ మహావిష్ణువుకి 'నేను అధికుడను అంటే నేను అధికుడను' అని వాదోపవాదం జరిగింది. వీరి మధ్య వాదోపవాదం జరుగుతుండగా అది తీవ్రస్థాయిని పొందుతుంటే దేవతల మొరవిన్న పరమేశ్వరుడు ఒక జ్యోతి స్తంభంగా వారిమధ్య ఆవిర్భవించాడు. దాని ఆది కనుక్కోవడానికి శ్రీమహావిష్ణువు వరాహరూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్ళారు. బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి దాని చివర కనుక్కుందుకు వెళ్ళారు. బ్రహ్మగారు వెళుతూ ఉండగా కేతకీ పుష్పం ( మొగలి పువ్వు ) ఒకటి క్రింద పడింది. దానిని నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు ? అని అడిగితే మొగలిపువ్వు ఎవరో ఒక మహానుభావుడు పరమభక్తితో నన్ను శంకరుడి మీద వేశాడు. అక్కడి నుంచి నేను క్రింద పడ్డాను. మీరు ఎక్కడికి వెడుతున్నారు? అని అడిగింది.
బ్రహ్మగారు నాకొక ఉపకారం చేస్తావా? అని అడిగాడు. ఏమిటి కావాలి మీకు? అని అడిగింది మొగలిపువ్వు. ఆయన క్రింద శ్రీమన్నారాయణుడు ఉంటారు. నేను ఆ పైభాగమును చూశానని సాక్ష్యం చెప్తావా? అని అడిగాడు. మొగలిపువ్వు చెప్తాను అన్నది. బ్రహ్మగారు మొగలిపువ్వుతో కలిసి క్రిందకు వచ్చారు. శ్రీమహావిష్ణువును ఆయన చూసి వచ్చారా? అని అడిగితే విష్ణువు నాకు కనపడలేదు. ఎంతదూరం వెళ్ళినా నేను కనుగొనలేకపోయాను అన్నారు. బ్రహ్మ గారు నేను చూసి వచ్చాను. సాక్ష్యం ఈ కేతకీ పుష్పం అన్నారు. జ్యోతి స్తంభంగా ఉన్న పరమాత్మ సాకారమును పొంది బ్రహ్మగారితో బ్రహ్మా నీకు దర్శనం అయిందని అబద్ధం ఆడావు. నీకు భూమియందు పూజ లేకుండుగాక! కానీ బ్రహ్మ స్థానమని ఒక స్థానం ఉంటుంది.
ఆ స్థానమునందు ఆవాహన పొంది నీవు గౌరవింపబడుతుంటావు. మహావిష్ణువు నేను చూడలేదని చెప్పారు కాబట్టి నాతో సమానంగా ఆయనకు వైభవోపేతంగా పూజలు ఉంటాయి. ఆ ఉత్సవములకు నీవు ఆధిపత్యం వహిస్తూ ఉంటావు. అందుకే బ్రహ్మోత్సవం అని బ్రహ్మగారి రథం ఉత్సవములకు ముందు నడుస్తుంది. కేతకీ పుష్పం అబద్ధం చెప్పింది కాబట్టి ఈ పుష్పం నా పూజయందు వినిమయం అవకుండుగాక! అంటే కేతకీ పుష్పం నాకు పూజార్హత లేదా అని బాధపడింది. నాకు పూజింపబడవు కానీ నా భక్తులయిన వారు నిన్ను తలలో ధరిస్తారు. వారు ధరిస్తే నేను ఎక్కువ ప్రీతి పొందుతాను. పూజ జరిగే ప్రాంగణం మొగలి పువ్వులతో అలంకారం చేస్తే ప్రీతి పొందుతాను. అని చెప్పాడు. అలా ఏర్పడిన శివలింగం జ్యోతి స్తంభంగా ఏర్పడినదే మహాశివరాత్రి. ఇది మెల్లమెల్లగా లింగాకృతి తగ్గిపోయి కంటిచే చూడదగినటువంటి లింగాకృతిని పొందిన రూపమే అరుణాచలంలో ఉన్న కొండ. ఆ శివుడు నిర్దేశించిన తరువాత పూజ ప్రారంభమయిన రోజే మహాశివరాత్రి.

శివరాత్రి పూట ఉదయాన నిద్రలేవగానే శివుడి మీదనే మనస్సును లగ్నంచేయాలి. శుభ్రంగా స్నానం చేశాక శివాలయానికి వెళ్ళి శివపూజను చేసి సంకల్పం చెప్పుకొని పూజాద్రవ్యాలను సమకూర్చుకోవాలి. ఆ రాత్రికి ప్రసిద్ధమైన శివలింగం ఉన్న చోటికి వెళ్ళి సమకూర్చుకొన్న పూజాద్రవ్యాలను అక్కడ ఉంచాలి. ఆ తర్వాత మళ్ళీ స్నానం , లోపల , బయట అంతాపరిశుభ్ర వస్త్రధారణలతో శివపూజకు ఉపక్రమించాలి. శివాగమ ప్రకారం పూజను చేయటం మంచిది. దీనికోసం ఉత్తముడైన ఆచార్యుడిని ఎంచుకోవాలి. ఏ మంత్రానికి ఏ పూజాద్రవ్యాన్ని వాడాలో ఆ క్రమంలో మాత్రమే పూజ చేయాలి.
భక్తి భావంతో గీత , వాద్య , నృత్యాలతో ఇలా ఆ రాత్రి తొలి యామం ( జాము ) పూజను పూర్తిచేయాలి. శివమంత్రానుష్ఠానం ఉన్నవారు పార్థివ లింగాన్ని పూజించాలి. ఆ తర్వాత వ్రతమాహాత్మ్య కథను వినాలి. ఈ పూజ నాలుగు జాములలోనూ ఆ రాత్రి అంతా చెయ్యాల్సి ఉంటుంది. వ్రతానంతరం యధాశక్తిగా పండితులకు , శివభక్తులకు విశేషించి సన్యాసులకు భోజనాన్ని పెట్టి సత్కరించాలి. నాలుగు జాములలో చేసే పూజ కొద్దిపాటి భేదంతో ఉంటుంది. తొలి జాములో పార్థివ లింగాన్ని స్థాపించి పూజించాలి. ముందుగా పంచామృతాభిషేకం, ఆ తర్వాత జలధారతో అభిషేకం నిర్వహించాలి.
చందనం, నూకలు లేని బియ్యం, నల్లని నువ్వులతో పూజచేయాలి. ఎర్రగన్నేరు, పద్మంలాంటి పుష్పాలతో అర్చించాలి. భవుడు , శర్వుడు , రుద్రుడు, పశుపతి, ఉగ్రుడు , మహాన్ , భీముడు , ఈశానుడు అనే శివదశ నామాలను స్మరిస్తూ ధూప దీప నైవేద్యాలతో అర్చన చేయాలి. అన్నం , కొబ్బరి , తాంబూలాలను నివేదించాలి. అనంతరం ధేను ముద్రను చూపి పవిత్ర జలంతో తర్పణం విడవాలి. అనంతరం అయిదుగురు పండితులకు భోజనం పెట్టడంతో తొలిజాము పూజ ముగుస్తుంది.
రెండోజాములో తొలిజాముకన్నా రెట్టింపు పూజను చేయాలి. నువ్వులు , యవలు , కమలాలు పూజా ద్రవ్యాలుగా ఉండాలి. మిగిలిన పద్ధతంతా తొలిజాములాంటిదే.
మూడో జాములో చేసే పూజలో యవలస్థానంలో గోధుమలను వాడాలి. జిల్లేడు పూలతో శివపూజ చేయాలి. వివిధ ధూపదీపాలను. శాకపాకాలను , అప్పాలను నివేదించాలి. కర్పూర హారతిని ఇచ్చిన తర్వాత దానిమ్మ పండుతో అర్ఘ్యం ఇవ్వాలి. పండిత భోజనాలన్నీ అంతకు ముందులాగే ఉంటాయి.
నాలుగోజాములో పూజాద్రవ్యాలుగా మినుములు , పెసలు లాంటి ధాన్యాలను , శంఖ పుష్పాలకు , మారేడు దళాలను వాడాలి. నైవేద్యంగా తీపి పదార్థాలను కానీ , మినుములతో కలిపి వండిన అన్నాన్నీ కానీ పెట్టాలి. అరటిపండు లాంటి ఏదో ఒక ఉత్తమమైన పండుతో శివుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా భక్తి పూర్వకంగా నాలుగు జాములలోనూ ఒక ఉత్సవంలాగా శివరాత్రి వ్రతాన్ని చేయాల్సి ఉంటుంది. ఏ జాముకు ఆ జాము పూజ పూర్తికాగానే ఉద్వాసన చెప్పటం , మళ్ళీ తరువాతి జాము పూజకు సంకల్పం చెబుతుండాలి.
నాలుగు జాముల శివరాత్రి వ్రతం ముగిశాక పండితులకు పుష్పాంజలి సమర్పించి వారి నుండి తిలకాన్ని , ఆశీర్వచనాన్ని స్వీకరించి శివుడికి ఉద్వాసన చెప్పాలి. ఈ వ్రతక్రమాన్ని శాస్త్రం తెలిసిన ఆచార్యుడి సహాయంతో క్రమం తప్పకుండా చేయటం మంచిది. ఇలా చేసిన భక్తుల వెంట తాను నిరంతరం ఉంటానని సర్వశుభాలు , సుఖాలు కలిగిస్తానని శివుడు బ్రహ్మ, విష్ణు, పార్వతులకు వివరించి చెప్పాడు ఈ కథను.
శివరాత్రి పూజకు మనస్సు ప్రధానంగా నిష్టగా నిలుపుకోవాలి. 'మనో మూలమిదం జగత్' మనసు నిర్మలం మంచికి మార్గం, మనసు నిర్మలము మహితశక్తి నిర్మలంపు మనసె నీరధిముత్యమౌ మరిచి పోవద్దు ఈ మంచిమాట.. ఈగ అన్నిటి పైనా వ్రాలు తుంది కానీ, అగ్ని పైన మాత్రం వ్రాలదు, వ్రాలితే జీవించదు. అదే విధంగా మనస్సు అన్నింటినీ చింతిస్తుంది, ఆత్మను చింతించదు. ఆత్మను చింతించెనా ఇంక లోక బాధలు చింతలు ఉండవు, ఎపుడూ ఆనందమే. ఆస్థితిలో రావాలంటే, అంతర్దృష్టి, మౌనమే ప్రధానము. ధ్యాన, మననములే, దానికి సాధనలు. జనులు దేవాలయమునకు కళ్ళు తెరుచుకుని వెళతారు, గర్భగుడిలో దైవదర్శనం చేసుకునే సమయంలో మాత్రం కళ్ళు మూసుకుని ధ్యానిస్తారు, అదే అంతర్దృష్టి. భగవంతుణ్ణి చర్మచక్షువులతో కాదు, జ్ఞానచక్షువులతో చూడాలి. మానవుడు తన మనస్సుకు బానిస కాకూడదు.
మనస్సు తనకు బానిసగా ఉండే అధికారి కావాలి. అపుడే పరమేశ్వరునికి దగ్గరవుతాము.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
ఉగాది నుండి వీరికి ధనయోగం.. బిజినెస్ అద్భుతం.. వృషభరాశి జాతకమిలా! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
వాస్తు ప్రకారం కిచెన్లో పూజ చేయవచ్చా? -
మీన, కుంభ రాశులలో ముఖ్య గ్రహాలు.. వీరికి నేడు డబ్బులే డబ్బులు! -
ఉగాది నుండి అదృష్టం పట్టబోతున్న రాశులు ఇవే! -
పరాభవ నామ ఉగాది పంచాంగం.. మేషరాశి వారి జాతకం! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications