రాఖీ పౌర్ణమి ఎప్పుడు, 27న రక్షాబంధన్ ఎందుకు జరుపుకోకూడదు?
భారతీయ సంప్రదాయంలో రక్షాబంధన్ కు అత్యంత ప్రాధాన్యత ఉంది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా భావిస్తారీ పండగను. జ్యోతిష్య పరంగా కూడా ఎంతో విశిష్టత ఉంది. ఈ పండగ ఈ నెల 28వ తేదీ శుక్రవారం నాడు జరుపుకోనున్నారు. ఈ ఏడాది రక్షాబంధన్ రోజున భద్రా ప్రభావం ఏమాత్రం లేకపోవడం విశేషం. శ్రావణ మాస పూర్ణిమ తిథి నాడు వచ్చే ఈ రాఖీ పండుగకు ఈసారి విశేషమైన జ్యోతిష్య యోగాలు తోడయ్యాయి.
ఈ రోజున శతభిషా నక్షత్రం, సుకర్మ యోగంతో పాటు మీన రాశిలో చంద్రుడి సంచారం వంటి అత్యంత శుభ సంయోగాలు కలగబోతున్నాయి. శుక్రవారం, సుకర్మ యోగాల కలయిక వల్ల ఈ పర్వదినం మరింత పవిత్రత, శ్రేయస్సును సంతరించుకోనుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం రక్షాబంధన్ పండుగ రోజున భద్రా కాలం ఛాయ పడుతుంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భద్రా కాలంలో రాఖీ కట్టడం అశుభంగా భావిస్తారు.

ఈ సారి భద్రా తిథి పండుగకు ఒక రోజు ముందే అంటే 27వ తేదీ ఉదయం 9:09 నిమిషాలకు ప్రారంభమై, అదే రోజు రాత్రి 9:25 నిమిషాలకు ముగిసిపోతుంది. భద్ర కాలంలో రాఖీ కట్టడం అత్యంత అశుభకరంగా పరిగణిస్తారు. 27న గురువారం నాడు పూర్ణిమ తిథి ప్రారంభమైన క్షణం నుంచే భద్ర ప్రభావం కూడా మొదలవుతుంది. ఈ సమయంలో రక్షా సూత్రాన్ని కట్టడం అశుభం అనే నమ్మకం ఉంది. అందుకే పూర్ణిమ తిథి ఉన్నప్పటికీ కూడా శాస్త్ర నియమాల ప్రకారం 27న రాఖీ కట్టకూడదు.
28న పండుగ రోజున భద్రా దోషం ఉండదు. ఈ రక్షాబంధన్ రోజే ఏడాది చివరి పాక్షిక చంద్రగ్రహణం సంభవించబోతోంది. 28వ తేదీ ఉదయం 6:53 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:31 గంటల వరకు గ్రహణ సమయం ఉంటుంది. ఇది భారత్ లో కనిపించదు. ఫలితంగా ఎలాంటి సూతక నియమాలను పాటించనక్కర్లేదని పండితులు చెబుతున్నారు.
28న రోజంతా భద్రా ప్రభావం లేకపోయినప్పటికీ, శాస్త్రోక్తంగా శుభ ఘడియల్లో రాఖీ కట్టడం వల్ల సోదరులకు దీర్ఘాయువు, ఐశ్వర్యం లభిస్తాయని పండితులు సూచిస్తున్నారు. అమృత ఘడియలు తెల్లవారు జామున 6:08 నుండి ఉదయం 10:53 వరకు ఉంటుంది. ఈ సమయంలో రాఖీ కట్టడం మంచిది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:53 నిమిషాల వరకు ఉంటుంది. శుభ ఘడియలు మధ్యాహ్నం 12:28 నుండి 2:03 నిమిషాల వరకు కొనసాగుతుంది.
అపరాహ్న కాల ముహూర్తం మధ్యాహ్నం 1:44 నుండి సాయంత్రం 4:16, చర ఘడియలు సాయంత్రం 5:13 నుండి సాయంత్రం 6:48 వరకు కొనసాగుతాయి. రాఖీ కట్టే సమయంలో కొన్ని సాంప్రదాయ నియమాలను పాటించాలి. సోదరుడు తూర్పు లేదా ఈశాన్య దిశ వైపు ముఖం ఉండేలా కూర్చోవాలి. పూజా పళ్లెంలో కంకుమ, చందనం, అక్షింతలు, దీపంతో పాటు కొన్ని తీపి పదార్థాలు అమర్చుకోవాలి. ముందుగా తిలకం దిద్ది, అక్షింతలు చల్లి హారతి ఇచ్చిన తర్వాత రాఖీ కట్టాలి.














Click it and Unblock the Notifications