శ్రావణంలో దానం చేయదగ్గ వస్తువులు.. ఓ దోసెడు పోసినా చాలు
హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి అత్యంత విశిష్ట స్థానం ఉంది. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తులు పూజలు, కఠిన ఉపవాసాలు, అభిషేకాలను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో జపతాపాలు, నిత్య పూజా కార్యక్రమాలు మాత్రమే కాకుండా, దానధర్మాలు చేయడం కూడా అంతే ముఖ్యమైన విధిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర కాలంలో చేసే దానాలు అనంత పుణ్యఫలాలతో పాటు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.
వైదిక శాస్త్రాల ప్రకారం, శ్రావణ మాసంలో చేసే దానాల వల్ల కష్టాలు, జాతక దోషాలు తొలగిపోతాయి. పేదలకు వారి అవసరాన్ని బట్టి తోచిన సహాయం చేయడం వల్ల సత్కర్మల ప్రభావం గణనీయంగా పెరుగుతుంది. మన శక్తి కొద్దీ ఇతరులకు దానధర్మాలు చేయడం ద్వారా ఆ భోళాశంకరుని అనుగ్రహం నేరుగా భక్తులపై ప్రసరిస్తుందని నమ్ముతారు. ఈ పవిత్ర మాసంలో ఎటువంటి వస్తువులను దానం చేయాలో స్పష్టంగా తెలుసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది.

గాజులు, పసుపు, కుంకుమ ఇవ్వడం ఆనవాయితీ. ఇవే కాకుండా మరికొన్ని ఉన్నాయి. ఈ మాసంలో దానం చేయాల్సిన వస్తువులలో మొదటిగా చెప్పుకోవాల్సింది.. ఆహార ధాన్యాలు, అన్నదానం. పేదలకు అన్నం పెట్టడం లేదా అవసరమైనన్ని వారికి బియ్యం, పప్పులు వంటి నిత్యావసర ఆహార ధాన్యాలను దానంగా సమర్పించడం చాలా శ్రేయస్కరం. ఈ విధమైన దానం చేయడం వల్ల ఇంట్లో ధనధాన్యాలకు ఎన్నడూ కొరత రాదని, లక్ష్మీదేవి ఎప్పుడూ ఇంట కొలువై ఉంటుందని విశ్వసిస్తారు. పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి.
గ్రహ పీడల నివారణ కోసం నల్ల నువ్వులు, కొంత నగదును దానం చేయడం ఎంతో మంచిది. శ్రావణ మాసంలో నల్ల నువ్వులను దానం చేయడం వల్ల.. ముఖ్యంగా శని దేవుని ఆగ్రహం, జాతకంలోని శని మహాదశ ప్రభావాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయని పురాణాలు చెబుతున్నాయి. జీవితంలో ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనలు, కోర్టు/ఆస్తి వివాదాల వంటి సమస్యల నుండి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
కైలాసవాసుడికి తెల్లని రంగు, తెల్లని వస్తువులు అంటే ఎంతో ఇష్టం. అందుకే ఈ మాసంలో పాలు, పెరుగు, పటికబెల్లం లేదా తెల్లటి బియ్యం వంటి వస్తువులను నిరుపేదలకు దానంగా ఇవ్వడం కూడా శుభదాయకంగా పరిగణిస్తారు. ఇలాంటి వస్తువుల దానం చంద్ర గ్రహ అనుకూలత లభిస్తుందని, మానసిక ప్రశాంతత, ఆలోచనా నైపుణ్యం మెరుగుపడుతుందని నమ్ముతారు. ఇంట్లోప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి, సానుకూల శక్తులు ప్రవేశిస్తాయని చెబుతారు.
లయకారుడైన శివుడికి ప్రకృతి, సృష్టితో గల అవినాభావ సంబంధం కారణంగా ఆకుపచ్చ రంగు వస్తువులు కూడా ఎంతో ప్రీతిపాత్రమైనవి. ఈ శ్రావణ మాసంలో పచ్చని పెసలను దానం చేయడం అత్యంత శుభప్రదమైన కార్యక్రమంగా శాస్త్రాలు చెబుతున్నాయి. పెసలు దానం చేయడం వల్ల బుధ గ్రహానికి సంబంధించిన లోపాలు తొలగిపోయి, వ్యాపారం, విద్య, ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది. జీవితంలో ఎదురయ్యే ఎటువంటి అడ్డంకులైనా విజయవంతంగా అధిగమించ్చు.
వస్త్రదానం కూడా విశిష్టమైన ఫలితాలను ఇస్తుంది. శీతాకాలం సమీపించే తరుణంలో చలితో ఇబ్బంది పడే పేదలు, నిరాశ్రయులకు దుప్పట్లు, నూతన వస్త్రాలు దానం చేయడం పుణ్యకార్యంగా భావిస్తారు. దీనివల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనే విశ్వాసం ఉంది.














Click it and Unblock the Notifications