Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంకష్టహర చతుర్ధి వ్రత విధానం:ఈ వ్రతంతో ఎలాంటి లాభాలు పొందొచ్చు..?

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి అంటారు. ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది.
ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి. సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది.

ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు, ఈ వ్రతాన్ని 12 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట హర వ్రతాన్ని చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.

Performing puja to lord Ganesh is called sankashta chathurthi.

ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ప్రదక్షిణ చేయవచ్చు. శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు. సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. "సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి.

చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి. ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.

సంకటహర గణపతి స్తోత్రం :-

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాసం స్మరేన్నిత్యమాయు: కామార్ధ సిద్ధయే
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం
లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకం
నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్
ద్వాదశైతావి నామాని త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం
నచవిఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో
విద్యార్దీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనం
పుత్రార్దీ లభతే పుత్రాన్ మోక్షార్ధీ లభతే గతిమ్
జపేత్ గణపతిస్తోత్రం చతుర్మాసై: ఫలం లభత్
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః

సంకట హర చతుర్ధి గొప్పదనం తెలియపరుచు కధ:- ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాప ములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది.

ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించ సాగాడు.
అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు... ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా! అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు.

సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసినవారు కనబడకపోదురా? అని!! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.
అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్ర్తీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెం టనే ఎంతో పాపాత్మురాలైన స్ర్తీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, నిన్నంతా ఈ పూర్తి ఉపవాసం వుండి. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది అని చెప్పాడు.

అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేష దూతని అపుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేష దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.

ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.

అంగారక చతుర్థి :- సంకష్టహర చవితి మంగళవారం వస్తే, దాన్ని అంగారక చతుర్థీ అంటారు. సంకష్టహర చవితి మంగళవారం రావడం విశేషం. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజ దోషాలు పరిహారమవుతాయి, జీవితంలో సంకటాలు తొలగిపోతాయి. భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి. నిజానికి వినాయకునికి ప్రతి నెలా చవితి రోజు మహా ఇష్టమైన రోజని చెప్తారు పెద్దలు. అందుకే ప్రతి నెలా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధి నాడు ఉపవాసం ఉంటారు కొందరు. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధిని ''సంకటహర చతుర్థి'' లేదా ''సంకష్టహర చతుర్ధి'' అంటారు.

అసలు సంకష్టహర గణపతి వ్రతమంటే ఏమిటి ? :- గణేశ పురాణం ప్రకారం వినాయకుని ఉపాసన ప్రాథమికంగా రెండు విధాలు. అవి 1. వరద గణపతి పూజ 2. సంకష్టహర గణపతి పూజ.
వీటిలో వరద గణపతి పూజ చాలావరకు అందరికీ తెలిసినదే, అది మనమందరమూ ప్రతీ సంవత్సరమూ చేసుకునే 'వినాయక చవితి'. అన్ని రకాల వరాలనూ మనకనుగ్రహించే ఈ వరద గణపతినే సిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు.

సంక్షిప్త వ్రత విధానం :-

1. సూర్యోదయమవకముందే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమూ, నిత్య పూజ పూర్తి చేసుకోవాలి.
2. తరువాత గణేశుని తలచుకొని ఆరోజు సంకష్టహర గణపతి వ్రతం ఆచరించడానికి సంకల్పించుకోవాలి.
3. పగలంతా ఉపవాసంగాని, అల్పాహారంతోగాని ఉండాలి. నిష్ఠతో గడపాలి.
4. సాయంత్రమవగానే స్నానం చేయాలి.
5. మట్టితో గణేశుని ప్రతిమచేసిగానీ, పసుపుతో మూర్తిని చేసిగానీ గణేశుని అందులోనికి రమ్మని ప్రార్థించాలి.
6. ధూప, దీపములూ, పుష్పాలంకరణ చేసి, తప్పనిసరిగా గరిక చిగుళ్ళతో పూజించాలి.
7. మూడు ఐదు లేదా ఏడు ఆకులు గల గరికలను, యిరవయ్యొకటి లేదా అంతకంటే ఎక్కువగానీ కనీసం ఒక్కటైనాగానీ సమర్పించాలి.
8. కొంతసేపు ఏదైనా గణేశ మంత్ర జపం చేయాలి.
9. గణేశునికి నైవేద్యం సమర్పించి హారతినివ్వాలి.
10. చంద్రోదయ సమయానికల్లా ఈ పూజ అంతటినీ ముగించాలి.
11. చంద్రుని చూచి, చంద్రునికీ చతుర్థీ తిథికి నమస్కరించి అర్ఘ్యమివ్వాలి.
12. తరువాత పూజామందిరంలోకి వెళ్ళి గణేశుని, "సంకటాం మాం నివారయ" (నా సంకటములను తొలగించు) అని వేడుకుని, నమస్కరించి అర్ఘ్యమివ్వాలి.
13. బ్రహ్మచారికి భోజనం పెట్టి , తరువాత తానూ భుజించాలి.
14. రాత్రంతా గణేశుని స్మరిస్తూ నిద్రపోవాలి.

* నిజానికి ఎంతో సులువుగా ఉన్నప్పటికీ మనకు పూజలు అంతగా అలవాటు లేకపోవడంచేత, ఈ వ్రత విధిలో కొన్ని సందేహాలు రావడం సహజం. నాకు కలిగిన సందేహాల నివృత్తి కోసం గణేశ పురాణం శోధించగా ఏ పూలు వాడాలి?

జ. మందారము వంటి ఎరుపు రంగు పూలు వినాయకునికి అత్యంత యిష్టం. వినాయక చవితి నాడు తప్ప గణేశ్వరుని పూజలో ఎప్పుడూ తులసి ఆకులు వాడరాదు. కాబట్టి అవి నిషిద్ధం.

ఏ మంత్రం జపించాలి?

జ. గురువుచే ఉపదేశింపబడిన గణపతి మంత్రం అత్యుత్తమం. అయినప్పటికీ, ' ఓం సంకష్టహర గణపతయే నమః ' అనే నామ మంత్రంగానీ,

'సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్ననాశో గణాధిపః
ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః
ద్వాదశైతాని నామాని యః పఠేచ్ఛ్రుణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సంకటేచైవ విఘ్నస్తస్య నజాయతే'
అనే నామ స్తోత్రంగానీ జపించవచ్చు.

నైవేద్యం ఏమి సమర్పించాలి? .. కుడుములు, ఉండ్రాళ్ళు, అరటి కాయలు, పాయసము, నువ్వులు, 21 మోదకాలు.

ప్రసాదం తెల్లవారిన తరువాత స్వీకరించాలా?

జ. కాదు. చంద్రోదయం తరువాత గణేశునికి నమస్కరించి ప్రసాదం తప్పనిసరిగా భుజించాలి.

రోజంతా గణేశ స్మరణలో గడపడానికి తేలికైన దారి ఏదైనా ఉందా?

జ. గణేశ పురాణం చదవడం (వినడం) లేదా గణేశునికై నైవేద్యాలు వండటం (సమర్పించడం). చేతనైతే నృత్య గీతాలూ మంచివే.

అర్ఘ్యం యివ్వటం తెలియకపోతే?

జ. నమస్కరించడం ఉత్తమం. తెలియని పూజావిధి తలకెత్తుకోవడం మంచిది కాదు.

పూజ చేయడం చేతకాదనుకుంటే?

జ. మంచి బ్రాహ్మణుని పిలిచి అతనితో చేయించుకోవడం సర్వవిధాలా శ్రేయస్కరం. అయితే తప్పనిసరిగా పూజ పూర్తయిన వెంటనే దక్షిణ యివ్వండి.

వ్రతాచరణ వలన లాభాలు

గణేశ పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు. వాటిలో పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్యాపాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజ దోష నివారణము, క్షయ వ్యాధి శమనము, బానిసత్వ విముక్తి, క్రోధోపశమనము, అకాల మృత్యు హరణము, కుష్ఠు వ్యాధి నివారణము, జ్ఞాన ప్రాప్తి, మహిమ, నష్ట వస్తు ప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ఉన్నాయి. అయితే నేటికాలంలో వాటి అన్నింటి అవసరం కూడా చాలామందికి లేదు. అందుకే గణేశ ఉపాసకులు సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతకదోషాలను పోగొట్టడంలో సాటిలేనిదిగా తెలియజేస్తున్నారు.

అనేక లాభాలు ఉన్న ఈ వ్రతాన్ని, ఒక్కఏడాది అయినా ఆచరిస్తే చాలు మన అదృష్టాన్ని సార్థకం చేసుకుందాం. ఆ శక్తి పుత్రుని శక్తి సహితుని అనుగ్రహాన్ని పొందుదాం.

పూర్తి వ్రతం చేయగలిగినా లేకున్నా కనీసం చంద్రోదయ సమయంలో చంద్రునికి, చతుర్థీ తిథికి, గణేశునికి నమస్కరించి భోజనం చేయండి. అత్యంత శ్రేయోదాయకమైన ముహూర్తం. గణేశానుగ్రహం తప్పక కలుగుతుంది.

సంకటహర గణపతి ధ్యానం, ఏకవింశతి నామాలు

ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభం
లంబోదరం విశాలాక్షం జ్వలత్పావకలోచనం
ఆఖుపృష్ఠ సమారూఢం చామరైః వీజితం గణైః
శేషయజ్ఞోపవీతం చ చింతయేత్తం గజాననం

ఏకవింశతి నామ పూజ :-

ఓం సుముఖాయ నమః మాలతీ పత్రం పూజయామి
ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి
ఓం ఉమాపుత్రాయ నమః బిల్వ పత్రం పూజయామి
ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి
ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి
ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి
ఓం గజకర్ణాయ నమః జంబూ పత్రం పూజయామి
ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి
ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి
ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి
ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి
ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి
ఓం సురాగ్రజాయ నమః గణ్డకీ పత్రం పూజయామి
ఓం ఇభవక్త్రాయ నమః శమీ పత్రం పూజయామి
ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి
ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి
ఓం కపిలాయ నమః అర్క పత్రం పూజయామి.

వ్రత కథ :- పుత్ర సంతానం లేని కృతవీర్యుని తపస్సు పితృలోకంలో ఉన్న అతని తండ్రిని కదిలించగా అతడు బ్రహ్మదేవుని ప్రార్థించి తన పుత్రునికై ఈ వ్రతాన్ని పుస్తకరూపంలో పొందినట్లూ దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీర్యునికి ప్రసాదించినట్లూ గణేశ పురాణం తెలుపుతుంది. కృతవీర్యుడు దీనిని పాటించి గణేశానుగ్రహంతో కార్తవీర్యార్జునుని వంటి పుత్రుని పొందిన విషయం ఇంద్రుని వల్ల తెలుసుకున్న శూరసేనుడనే మహారాజు తానూ సంకష్టహర గణపతి వ్రతం ఆచరించి, తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలనందరినీ వినాయకలోకానికి తీసుకువెళ్ళగలిగినట్లూ వ్రత కథ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+