కాకినాడ తీర్మానం సజీవంః దత్తాత్రేయ
న్యూఢిల్లీః ప్రత్యేక తెలంగాణా కావాలంటూ కాకినాడలో చేసిన తీర్మానం ఇంకా సజీవంగానే వున్నదని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ఎం.పి. బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన బిజెపి జాతీయ అధ్యక్షుడు జానా కృష్ణమూర్తిని కలుసుకున్నారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు బిజెపి వ్యతిరేకమంటూ జానా కృష్ణమూర్తి ఇటీవల తేల్చి చెప్పినవిషయం విదితమే.
దీనితో బిజెపి రాష్ట్ర శాఖలో కలకలం బయలు దేరింది. బిజెపి జాతీయ పార్టీ నిర్ణయం తెలంగాణా ప్రాంతంలో బిజెపికి అశనిపాతం వంటిదని పలువురు ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు బహిరంగంగానే ప్రకటించారు. పరిస్థితి చేయదాటిపోతున్నదని గ్రహించిన బిజెపిసీనియర్ నేతలలో కలవరం ప్రారంభమైంది. ఇందులో భాగంగానే దత్తాత్రేయ జానాకృష్ణమూర్తిని కలుసుకున్నారని భావిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు డిమాండ్ కు మద్దతు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు కానీ బిజెపి రాష్ట్రశాఖ కాకినాడ తీర్మానానికి కట్టుబడే వుండుందని దత్తాత్రేయ విలేకరులకు చెప్పారు. కేవలం తెలంగాణా బిజెపి నేతలను బుజ్జగించేందుకే దత్తాత్రేయ ఈ ప్రకటన చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.