డ్వాక్రా మహిళలకుపెద్దపీట
విశాఖపట్నం: చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను సాధించి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశంలో తెలుగుదేశం ఈ అంశంపై పోరాడుతుందని ఆయన తెలిపారు. మహిళల సాధికారత దినం సందర్భంగా మంగళవారం నాడు విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా మహిళా చైతన్య సదస్సులో ఆయన ప్రసంగించారు.
ఉత్తర కోస్తాలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన డ్వాక్రా బృందాలు ఈ సదస్సులో పాల్గొన్నాయి. పార్లమెంటులో ఇతర పార్టీలు ఎన్నిఅడ్డంకులు కల్పించినప్పటికీ, చట్టసభలలో మహిళా రిజర్వేషన్ను సాధించి తీరుతామని ఆయన అన్నారు. దేశంలో మొదటి సారిగా మహిళా రిజర్వేషన్లను డిమాండ్ చేసింది తెలుగుదేశం పార్టీయేనని ఆయన గుర్తుచేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలలోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేందుకు తాము అన్ని విధాలా ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా ఏర్పాటయిన డ్వాక్రా మహిళా సంఘాలు ఇలాగే పనిచేస్తే స్వర్ణాధ్ర ప్రదేశ్ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలకు వున్న అవగాహన మన రాజకీయ నాయకుల్లో వుండే రాష్ట్రాన్ని అతితక్కువ కాలంలో ఆదర్శరాష్ట్రంగా తీర్చిదిద్దవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికలలో డ్వాక్రా మహిళలు చిత్తశుద్ధితో పని చేసి నిజాయితీ పరులను ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ప్రాధాన్యత నిస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.