ఎన్నికలకోసం జల రాజకీయం
హైదరాబాద్: రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికలను దృష్టిలో వుంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలరాజకీయం ప్రారంభించారని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన గోదావరి జలాల ఎత్తిపోతల పధకం పెద్ద ఫార్స్ అని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణాలో గోదావరిపై ఎటువంటి ప్రాజెక్టు చేపట్టాలన్నా ఇచ్చంపల్లిని మించిన స్థలం లేదని నిపుణులు ఇదివరకే స్పష్టం చేశారని చంద్రశేఖర్రావు చెప్పారు. వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తామని ప్రకటించిన ప్రాంతంలో కనీసం సైట్ సర్వే కూడా చేయలేదని ఆయన దుయ్యబట్టారు. కేవలం ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగడానికి అనువైన ప్రాంతం ఎక్కడా అనే సర్వేతప్ప ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనువైనదా కాదా అన్న సర్వే ఎక్కడ జరిపారని ఆయన ప్రశ్నించారు.
సర్వే కూడా లేకుండానే ఏకంగా శంకుస్థాపన దాకా వెళ్లిపోయారని ఆయన విమర్శించారు. స్ధానిక సంస్ధల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు చేస్తున్న జిమ్మిక్కులకు తెలంగాణా ప్రజలు మోసపోరని చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు ఆమోదం వచ్చిందని చెబుతున్న చంద్రబాబు దానికి సంబంధించిన లేఖను చూపగలరా అని చంద్రశేఖర్రావు సవాలు చేశారు.