ఒకే రోజు ఎన్నికలకు వినతి
హైదరాబాద్ : జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు నిర్వహించాలని అఖిల పక్షసమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోరాయి. స్ధానిక సంస్ధల ఎన్నికల గురించి చర్చించేందుకు సోమవారం నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
జులై నెలలో రాష్ట్రంలోని 14063 ఎంపిటిసి, 1095 జడ్పిటిసిలకు ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రమంతటా ఒకే రోజు ఎన్నికలు నిర్వహించలేని పక్షంలో జిల్లానొక యూనిట్గా భావించి, జిల్లా అంతటా ఒకే రోజు ఎన్నికలు జరిపించాలని రాజకీయ పార్టీలు కోరాయి. అధికార తెలుగుదేశం పార్టీ కూడా ఈ డిమాండ్కు మద్దతునిచ్చింది. ఒకే జిల్లాలో రెండు మూడు రోజుల పోలింగ్ వద్దని వివిధ పార్టీలనేతలు సూచించారు.
భద్రతాపరమైన అంశాల దృష్ట్యా ఒకే రోజులో పోలింగ్ జరపటం సాధ్యకాదని, అయినా ప్రయత్నిస్తామని ఎన్నికల కమీషనర్ కాకి మాధవరావు హామీ ఇచ్చారు. ఈ విషయంలో డిజిపితో చర్చిస్తానని ఆయన అన్నారు. ఎన్నికల్లో పాల్గొంటున్న జాతీయ పార్టీలతో సహా అన్నిపార్టీలూ రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఈ సందర్భంగా ఎన్నికల కమీషనర్ స్పష్టం చేశారు. నాలుగయిదు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టుగా ఆయన వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటినుంచే నియమావళి అమల్లోకి వస్తుందని ఆయన చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఈ ఎన్నికల్లో అభ్యర్దుల ప్రచారం ఖర్చు వివరాలను తెలుసుకునే అవకాశం ప్రజలకు కల్పిస్తున్నట్టుగా కూడా మాధవరావు తెలిపారు.