19న డిశ్చార్జి కానున్న వాజ్పేయి
న్యూఢిల్లీః ముంబయ్ లోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో కుడి మోకాలికి శస్త్ర చికిత్సచేయించుకున్న భారత ప్రధాని అటల్బిహారీ వాజ్ పేయి మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ కానున్నారు. ఈ నెల 7 న వాజ్పేయి మోకాలికి అంతర్జాతీయ ఆర్థొపెడిక్స్ నిపుణుడు చిత్తరంజన్ రణావత్ ఆపరేషన చేసినవిషయం విదితమే. 12 రోజులుగా ఆస్పత్రిలో వున్న వాజ్పేయి మంగళవారం డిశ్చార్జి అవుతారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ చేరుకున్న అనంతరం కూడా వాజ్ పేయి మూడు వారాలపాటు తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటారని ఆ వర్గాలువివరించాయి. వాజ్ పేయి విశ్రాంతి తీసుకొనే ఆ మూడు వారాల సమయంలో వైద్యులు ఆయనకు ఫిజియో ధెరపీ చేస్తారు. ఈ ఫిజియో ధెరపీ మరో ఆరు మాసాలు కొనసాగుతుందని భావిస్తున్నారు. వాజ్పేయి ఆరోగ్యంగానే వున్నప్పటికీ ఆయన వయసును దృష్టిలో వుంచుకొని మరో మూడు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సలహా ఇచ్చారు. జూలై లో పాక్సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ తో వాజ్పేయి శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాల్సి వుంది. ఈ లోగా వాజ్పేయి పూర్తిగా కోలుకుంటారని భావిస్తున్నారు.