కొత్త మార్కెట్లపై సత్యం దృష్టి
హైదరాబాద్: అమెరికాలో నెలకొని వున్న మాంద్యం ఐటి రంగం పై తీవ్రప్రభావమే చూపిందని సత్యం కంప్యూటర్ చైర్మన్ రామలింగరాజు తెలిపారు. ఈ మాంద్యం ప్రభావం తమ కంపెనీ పురోభివృద్ధిపై పడకుండా తాము కొత్త మార్కెట్లలోకి అడుగుపెట్టడం, సరికొత్త టెక్నాలజీ డెవలప్ చేయడం వంటి వ్యూహాలను అనుసరిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.
శుక్రవారం నాడు జరిగిన సత్యం కంప్యూటర్ ఎజిఎంలో ఆయన పాల్గొన్నారు. మారిన పరిస్థితిలో ఐటి కంపెనీలు నిలదొక్కుకుని ముందుకు సాగాలంటే భాగస్వామ్య కంపెనీల ద్వారా వ్యాపారం సాగించే పద్దతులకు స్వస్తి చెప్పి, నేరుగా కస్టమర్లతోనే సంబంధాలు పెట్టుకోవల్సిన అవసరం వున్నదని ఆయన చెప్పారు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వారికి కావల్సిన టెక్నాలజీని సర్వీసులను నేరుగా అందజేయడం అవసరమని ఆయన చెప్పారు. ఫార్చూన్ 500 కంపెనీల్లో 40 పైగా కంపెనీలు తమ కస్టమర్లుగా వున్నాయని, ఐటిరంగంలోని సవాలును సత్యం తేలిగ్గా ఎదుర్కోగలదని ఆయన చెప్పారు.
డాట్ కామ్ రంగంలో సంక్షోభం తర్వాత ఇప్పుడు పరిస్థితి చక్కదిద్దుకుంటున్నదని ఇ-బిజినెస్పై వాణిజ్య సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం నష్టాల్లో వున్న సత్యం ఇన్ఫోవే నష్టాలనుంచి త్వరలోనే బయటపడుతుందనే ధీమా ఆయన వ్యక్తం చేశారు. అమెరికాలోని మరో అనుబంధం సంస్థ విజన్ కంపాస్లో వ్యూహాత్మకపెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.
పితృవియోగంతో వున్న రామలింగరాజు షేర్ హోల్డర్ల సమావేశంలో పాల్గొనడం సత్యం వాటాదారులను కదిలించింది. శుక్రవారం నాడే సాయంత్రం ఆయన తండ్రి సత్యనారాయణరాజు అంత్యక్రియలు వుండగా ఉదయం జరిగిన షేర్హోల్డర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications