సాయం కోసం బాబు ఢిల్లీ యాత్ర
హైదరాబాద్: రాష్ట్రంలోని 80 శాతం మండలాల్లో తీవ్రమైన కరవు రాజ్యమేలుతున్నదని ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కరవు పరిస్థితిని కచ్చితంగా అంచనా వేయడంలో విఫలమైందని ప్రతిపక్షాలు తీవ్రంగా దుయ్యబట్టాయి. కరవుపై చర్చకు తక్షణమే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 900 పైచిలుకు మండలాల్లో నెలకొని వున్న కరవు పరిస్థితిపై చర్చించేందుకు ప్రభుత్వం సోమవారం నాడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సమావేశంలో వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. కరవు సాయంలో రాష్ట్ర ప్రభుత్వంఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. నీరుమీరు పై ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన ప్రచారం ఎంత బూటకమో ఈ కరవే ఎత్తి చూపిస్తున్నదని ప్రతిపక్ష నేతలువిమర్శించారు.
కరవు పీడిత ప్రాంతాల్లోవిద్యుత్ చార్జీల వసూలు, విద్యార్ధుల ఫీజులు, సహకార సంఘాల రుణాల వసూలను నిలిపివేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. ప్రతిమండలానికి కోటి రూపాయల చొప్పున కేటాయించాలని కాంగ్రెస్ చేసిన డిమాండ్ను ప్రభుత్వం తోసిపుచ్చింది. జిల్లాలనుంచి కరవు స్థితిపై నివేదికలను తెప్పిస్తున్నట్టుగా సమావేశంలోప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
అఖిల పక్ష సమావేశంలో వివిధ పార్టీల నేతలు చేసిన సూచనలను, జిల్లాలనుంచి వచ్చిన నివేదికలను రెండు మూడు రోజుల్లో జరుగనున్న కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్టు ఆయన చెప్పారు. మంత్రిమండలి చర్చల ఆధారంగా కరవు సాయం కోసం తానేస్వయంగా ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నట్టుగా ఆయన చెప్పారు. కాగా కరవు పీడిత ప్రాంతాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను తెలుగుదేశం ఘనంగా ప్రశంసించింది. ప్రతిపక్షాలు కరవును రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఇది ఏ మాత్రం మంచిది కాదని దేశం ప్రతినిధి బాషాపేర్కొన్నారు.