ప్రజాస్వామ్య స్ఫూర్తేశ్రీరామరక్ష
న్యూఢిల్లీః దేశంలోని కోట్లాది మంది సగటు ప్రజలు ఆశలు, ఆశయాలకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి స్వేచ్ఛకు న్యాయానికి మధ్య మరింత అర్ధవంతమైన సమతౌల్యాన్ని సాధించాల్సిన అవసరం వున్నదని రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ పిలుపునిచ్చారు.
54వస్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం నాడు ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉప్పెనలా విరుచుకుపడిన గ్లోబలైజేషన్ నిరుపేదల జీవితాలను చిన్నాభిన్నం చేయకుండా ఈ సమతౌల్యమే రక్షించిందని ఆయన అన్నారు. అనేక కష్టాలు, నష్టాలు, ఘర్షణలు, వైవిధ్యాల మధ్య దేశ ప్రజలు సుసంఘటితంగా మసులుకుంటూ పటిష్టమైన ప్రజాస్వామికి వ్యవస్థని నిర్మించగలిగారని ఆయన అభినందించారు.
గత ఆయిదు దశాబ్దాల కాలంలో భారత్ సాధించిన మహత్తరవిజయం ఇదేనని ఆయన అన్నారు. వేల సంవత్సరాల భారతదేశ చరిత్రలో శాంతి సౌభాగ్యాలతోసమైక్యతతో దేశప్రజలు సంఘటితంగా, సమైక్యంగా ముందుకు సాగిన సుదీర్ఘకాలం ఇదేనని ఆయన చెప్పారు. ఈ 50 ఏళ్లలో ఎన్నో తప్పులు జరిగివుండవచ్చు, ఎన్నో ఆటుపోట్లను దేశం ఎదుర్కుని వుండవచ్చు
ఎన్ని జరిగినా ఈ 50 ఏళ్లలోనే భారత్ ఒకసమైక్య శక్తిగా ప్రపంచదేశాల మధ్య నిలిచిందన్నవిషయం మర్చిపోరాదని ఆయన అన్నారు. దేశంలోని సంపన్నులు, కులీనవర్గాలు సాటి ప్రజలకోసం దేశం కోసం తమవంతు కర్తవ్యంగా ఏంచేయాలో ఆలోచించుకుని నిర్ణయించుకోవల్సిన అవసరం వున్నదని ఆయన చెప్పారు. కోట్ల సంఖ్యలో వున్న సగటు అమాయక జీవుల ఆలోచల్లో పరిణితి, చైతన్యం కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. తమకు కావల్సిందేమిటో వారు నిర్ణయించుకోగలుగుతున్నారని ఆయన చెప్పారు. భారత్ సాధించినవిజయాలకు కేవలం సౌభ్రాతృత్వం, శాంతియుత విధానాలే కారణమన్నవిషయం కూడా మరువరాదని ఆయన చెప్పారు.