తమిళనేత మూపనార్ కన్నుమూత
చెన్నయ్ః తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జి.కె. మూపనార్ గురువారం ఉదయం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మూపనార్ కొద్దిరోజులుగా ఆస్పత్రిలో వున్నారు. కాంగ్రెస్ పార్టీలో పలు కీలక పదవులు నిర్వహించిన మూపనార్ మృతికి పలువురు నేతలు నివాళులుఅర్పించారు.
మూపనార్ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్ధం చెన్నయ్ లోని ఆయన నివాసంలో వుంచారు. శుక్రవారం నాడు ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మూపనార్ కుటుంబ సభ్యులు తెలిపారు.
నెహ్రూ కుటుంబానికి అత్యంత సన్నిహితునిగా మెలిగిన మూపనార్ సాధారణ రైతు కుటుంబంలో జన్మించి అత్యున్నత స్థానానికి ఎదిగారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు ఆయన అత్యంత సన్నిహితునిగా మెలిగారు. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షునిగా, ఎఐసిసి ప్రధాన కార్యదర్శిగా పలు కీలక పదవులు నిర్వహించారు. 1978లో రాజ్యసభ కు ఎన్నికైన మూపనార్ తుదిశ్వాస విడిచే వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు.
ఇందిర, రాజీవ్ గాంధీలకు కష్టకాలంలో ఆపద్భాంధవుడిలా మూపనార్ వ్యవహరించారు.పి.వి. నరసింహారావు ప్రధానిగా వున్న సమయంలో కూడా మూపనార్ కు కీలక బాధ్యతలుఅప్పగించారు. అయితే తమిళనాడు ఎన్నికల్లో ఎఐఎడిఎంకెతో పొత్తువిషయంలో మూపనార్ మాటను పి.వి. లెక్కచేయకపోవడంతో తిరుగుబాటు బావుటా ఎగురవేసి తమిళమానిల కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ తరువాత జాతీయ రాజకీయాల్లో కూడా మూపనార్ కీలక పాత్ర నిర్వహించారు. రాజనీతిజ్ఞుడిగా నీరాజనాలందుకున్న మూపనార్ నుఅంతా ముద్దుగా జికెఎం అని పిలిచుకొనే వారు.
మూపనార్ ఎన్నోపదవులను అధిష్టించినప్పటికీ కింగ్ మేకర్గానేపేరుగాంచారు. కాంగ్రెస్ హయాంలో తమిళనాడు ముఖ్యమంత్రుల ఎంపికలో ఆయన కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడైన మూపనార్కు గురువారం నాడు రాజ్యసభ ఘణంగా నివాళులర్పించింది.












Click it and Unblock the Notifications