కాంగ్రెస్ సభ రసాభాస
హైదరాబాద్: గాంధీభవన్లోని ప్రకాశంహాల్లో శనివారం ఏర్పాటయిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి సమావేశం రసాభాసగా మారింది. తోపులాటలతో, కేకలతో అట్టుడికిపోయింది. కాంగ్రెస్ లేజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) మాజీ నేత పి. జనార్ధన్ రెడ్డి అనుచరులు వేదికమీదికి చేరి నినాదాలు చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావుతో వాదనకు దిగారు. పిసిసి కార్యవర్గంలో తమనాయకుడు పి. జనార్ధన్ రెడ్డికి సముచిత స్థానం లభించినందుకు నిరసనగా ఈ నిరసన వెల్లువ పెల్లుబుకింది. పిసిసి కార్యవర్గం ఖరారయిన తరువాత వ్యక్తమైన తొలి నిరసన ఇదే.
పి. జనార్ధన్ రెడ్డిని కార్యవర్గ సభ్యుడిగా మాత్రమే నియమించాలని తాను ఎఐసిసికి సూచించలేదని, పొరపాటున ఆయన పేరు కార్యవర్గ సభ్యుల జాబితాలో వచ్చి వుంటుందని, సిఎల్పి మాజీ నేతలందరూ ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలోకి వస్తారని సత్యనారాయణ రావు నచ్చజెప్పారు. ఈ మేరకు సమావేశానంతరం గాంధీభవన్ నుంచి ఒక ప్రకటన విడుదలయింది. సభలో ఎం. సత్యనారాయణరావు ప్రసంగం పూర్తయిన తర్వాత ఇదంతా జరిగింది.
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలు నిర్వహించడం ద్వారా ప్రజలకు సన్నిహితం కావాలని సత్యనారాయణరావు యువజన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆత్మరక్షణ దళాలుగా ఏర్పడాలని తాను కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చిన పిలుపును వక్రీకరిస్తున్నారని సిఎల్పి నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాజకీయ ప్రత్యర్థులు చంపుతుంటే కాంగ్రెస్ ఆత్మరక్షణ దళాలు ఏర్పాటు చేసుకోవాలని తాను అన్నట్లు ఆయన చెప్పారు.