అల్పపీడనం ఎఫెక్ట్- ఈ జిల్లాల్లో పిడుగులతో భారీ వర్షాలు, తాజా హెచ్చరిక..!!
వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. రానున్న 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.
శ్రీలంక పరిసరాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 48 గంటల వ్యవధిలో.. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. బిహార్ నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు ఈ ద్రోణి విస్తరించబోతోందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఈ నాలుగు రోజుల్లో, అంటే గురువారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపారు. అలాగే పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని హెచ్చరించారు. దీనితో పాటు గంటకు 30-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఏపీలో ఆదివారం ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు ఆయన వెల్లడించారు.

రానున్న మూడు రోజుల పాటు వర్షాలకు ఛాన్స్
మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 30-50 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని ప్రఖర్ జైన్ సూచించారు. పాత భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించారు.మరోవైపు అల్లూరి జిల్లా జికే వీధి, పోలవరం జిల్లా గుర్తేడు మండలాల్లో తీవ్రవడగాలులు, అలాగే అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు మండలంలో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.













Click it and Unblock the Notifications