మమతా బెనర్జీకి ఊహించని షాక్.. TMC నుంచి అవుట్.. మేనల్లుడు కూడా..
పశ్చిమ్ బెంగాల్ ప్రధాన ప్రతిపక్షం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత విభేదాలు పరాకాష్టకు చేరాయి. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నాయకత్వానికి గట్టి సవాల్ విసురుతూ, అసమ్మతి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యే అరూప్ రాయ్ ను పార్టీ నూతన చైర్మన్ గా ఎన్నుకుంది. దీంతో మమతా బెనర్జీ ఏకఛత్రాధిపత్యానికి పెద్ద దెబ్బ తగిలినట్లయింది.
కోల్ కతాలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో తిరుగుబాటు విభాగం ఈ మేరకు నూతన కమిటీని ప్రకటించింది. మాజీ మంత్రి అరూప్ బిశ్వాస్, ఎమ్మెల్యేలు ఫిర్హాద్ హకీమ్, రథిన్ ఘోష్, సబీనా యాస్మిన్ లను వైస్ చైర్మన్ లుగా నియమించారు. రితబ్రత బెనర్జీ, జావేద్ ఖాన్, సందీపన్ సాహాలను జనరల్ సెక్రటరీలుగా ఎంపిక చేశారు. ఈ నిర్ణయాలను త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించి, తమదే అసలైన టీఎంసీగా క్లెయిమ్ చేయాలని ఈ గ్రూపు యోచిస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు రగిలాయి. కొద్ది రోజుల క్రితమే మొత్తం 80 మంది పార్టీ ఎమ్మెల్యేలలో 58 మంది రితబ్రత బెనర్జీకి మద్దతు ప్రకటించారు. అలాగే, పార్లమెంట్లోనూ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. లోక్సభలోని 28 మంది టీఎంసీ ఎంపీలలో 20 మంది ప్రత్యేక సమూహంగా ఏర్పడి, నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI)లో విలీనమయ్యారు. వీరంతా కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మద్దతు పలికారు.
ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ వ్యవస్థాపకురాలు మమతా బెనర్జీ పట్ల తిరుగుబాటు నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆమె తమ వర్గానికి ప్రధాన సలహాదారుగా ఉండాలనుకుంటే సాదరంగా ఆహ్వానిస్తామని రితబ్రత బెనర్జీ పేర్కొనడం గమనార్హం. పార్టీ రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఈ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించామని, త్వరలోనే జిల్లా కమిటీలను కూడా ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఒకప్పుడు తిరుగులేని శక్తులుగా వెలిగిన ప్రాంతీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం కరువైనప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ సంక్షోభం నిరూపిస్తోంది. ఇప్పుడు అసలైన తృణమూల్ అధికారం ఎవరిదనే అంశంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. ఈ రాజకీయ పరిణామాలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో నూతన సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications