షాకింగ్: ఒకే ఇంట్లో కుళ్లిన స్థితిలో నాలుగు మృతదేహాలు.. ఏం జరిగింది..?
నల్గొండ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదకరమైన సంఘటన జరిగింది. పట్టణ పరిధిలోని సాగర్ రోడ్డులో ఉన్న తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటనతో నల్గొండ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఇంటి పక్కనవారికి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి ఆ ఇంటికి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూసి ఒక్క సారిగా షాక్ అయ్యారు. కుళ్లిపోయిన స్థితిలో నాలుగు మృతదేహాలు కనిపించాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇది హత్యా..? ఆత్మహత్యా..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే..
మృతుల వివరాలు చూస్తే ప్రకాశం బజార్ లో బ్యాగుల వ్యాపారం చేస్తున్న మహమ్మద్ సుల్తాన్, అతని భార్య ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న సుల్తానా గా గుర్తించారు. వారితో పాటు మరో ఇద్దరి మృతదేహాలు కూడా కుళ్లిపోయి ఉన్నాయి. ఇక సుమారు నాలుగు రోజుల క్రితమే వీళ్లు మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు ఎస్పీ రమేష్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications