బండి భగీరథ్ పోక్సో కేసు.. సీఎం రేవంత్ సీరియస్, విచారణకు సిట్!
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ కేసు విచారణపై బీఆర్ఎస్ తో పాటు బీజేపీ ప్రత్యర్ధి వర్గాల నుండి పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్న వేళ విచారణలో జాప్యం జరిగినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మే 8న ఫిర్యాదు అందినా తక్షణ చర్యలు తీసుకోకపోవడంపై పోలీసు ఉన్నతాధికారులను సీఎం తీవ్రంగా ప్రశ్నించారు.
స్పెషల్ టీం ఏర్పాటు చెయ్యాలని సీఎం ఆదేశం
కేసు దర్యాప్తు సమర్థవంతంగా, పారదర్శకంగా జరగాలంటే ప్రత్యేక బృందం (SIT) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీ సీవీ ఆనంద్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేసులో నిష్పక్షపాతమైన దర్యాప్తు కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాజకీయ విమర్శలు, వివాదాల నేపథ్యంలో ఈ కేసు విచారణపై ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.

బాలికపై లైంగిక వేధింపులు.. బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు
17 ఏళ్ల మైనర్ బాలికను మద్యం తాగించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్లో బీఎన్ఎస్ సెక్షన్లు 74, 75 మరియు పోక్సో చట్టం సెక్షన్లు 11, 12 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. గత డిసెంబర్లో మొయినాబాద్ ఫామ్హౌస్లో బాలికను బలవంతంగా మద్యం తాగించి లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఫిర్యాదులో ఆరోపించారు.
బాలిక రెండుసార్లు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందన్న తల్లి
నానక్రాంగూడ అపార్ట్మెంట్లో కూడా ఇలాంటి సంఘటన జరిగినట్లు పేర్కొన్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక బాలిక రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తల్లి ఫిర్యాదు చేసింది.దీంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేయగా, పోక్సో కేసు నమోదు కావడానికి కొన్ని గంటల ముందే భగీరథ్ కరీంనగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో బాలిక మరియు ఆమె కుటుంబం పైన కౌంటర్ ఫిర్యాదు చేశారు.
హనీ ట్రాప్ అంటూ భగీరధ్ కౌంటర్ కేసు
హనీట్రాప్ చేసి వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే రూ.50 వేలు ఇచ్చినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బాలిక కుటుంబం పైనా వేరే కేసు నమోదైంది. ప్రస్తుతం భగీరథ్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం బండి సంజయ్ కుటుంబాన్ని కాపాడుతోందని విమర్శిస్తున్నారు.
స్పెషల్ టీమ్ ఈ కేసులో ఏం తేలుస్తుందో?
బండి సంజయ్ ఈ ఆరోపణలను కుట్రగా అభివర్ణించారు. ప్రధాని మోదీ పర్యటనకు ముందు తనను అప్రతిష్టపాలు చేయడానికి జరిగిన పనేనని ఆరోపించారు. అయితే సీఎం రేవంత్ ఆదేశాలతో ఏర్పాటు అయ్యే స్పెషల్ టీం ఈ సున్నితమైన కేసును ఎలా నిర్వహిస్తుందనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.













Click it and Unblock the Notifications