రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుట్కా, పాన్ మసాలాలపై సంవత్సరం పాటు నిషేధం
కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు, నికోటిన్ ఉన్న ఉత్పత్తుల అమ్మకంపై ఏడాదిపాటు నిషేధం విధించింది. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే ప్రజల వినియోగంపై మాత్రం నిషేదం విధించలేదు. ఈ మేరకు ది ఫుడ్ సేఫ్టీ డివిజన్, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలు జారీ చేసింది. గుట్కా, పాన్ మసాలా ఉత్పత్తుల్ని మానుఫ్యాక్చరింగ్ చేయడం, స్టోరేజీ, ట్రాన్స్ పోర్టేషన్ చేయడం, డిస్ట్రిబ్యూషన్ చేయడాన్ని ఏడాదిపాటు పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రత్యేకమైన తనిఖీలు, విజిలెన్స్ బృందాలు, ఫుడ్ సేఫ్టీ అధికార బృందాలు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేపట్టాయి.
ఆ తర్వాత ఆగస్టు 10న ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. సెక్షన్ 30(2)(ఏ), ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 అండ్ రెగ్యూలేషన్ 2.3.4 లోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యూలేషన్స్, 2011 ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉత్తర్వులు జారీ తేదీ నుంచి ఈ నిషేధం కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదిపాటు అమలులో ఉండనుంది. గుట్కా, పాన్ మసాలాలలో ఉండే హానికరమైన రసాయన పదార్థాలు, పొగాకు కేన్సర్ కు కారణం అవుతున్నాయి. నోటి కేన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధుల బారి నుండి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

ఏదైనా ప్రాంతంలో అక్రమంగా గుట్కా, పాన్ మసాలా ఉత్పత్తుల్ని విక్రయించినా, ఉత్పత్తి చేసినా, పంపిణీ చేసినా వెంటనే సంబంధిత అధికారులు, డిపార్ట్ మెంట్ కు సమాచారం అందించాలని ప్రజల్ని అధికారులు కోరారు. హెల్దీ అండ్ అడిక్షన్ ఫ్రీ కర్ణాటక రాష్ట్రం కోసం అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ నిషేధం కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర్వులు జారీ చేసిన సమయం నుంచి ఏడాదిపాటు అమలు కానుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ నిషేదం అమల్లో ఉంది.













Click it and Unblock the Notifications