సిద్దిపేటలో దేశం నిర్వాకం - దద్దరిల్లిన సభ
హైదరాబాద్ః సిద్దిపేట ఉపఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్ల్యేలు, ఓ మంత్రి డబ్బు పంపిణీ చేస్తూ పట్టుపడ్డారని కాంగ్రెస్ పార్టీ గురువారంఅసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. సిద్దిపేట ఉపఎన్నికల సందర్భంగా డబ్బుపంచుతూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్ల్యేలు, ఓఎం.పి., మరో మంత్రి కూడా పట్టుపడ్డారనే వార్తలు అన్ని దినపత్రికల్లో ప్రచురితం అయ్యాయి. అయితే ఓ ప్రముఖ దినపత్రిక కధనం మాత్రం తెలుగుదేశం పార్టీని సమర్థించే విధంగా వుంది. ఈ వార్తాపత్రికలను సభలో చూపుతూ కాంగ్రెస్ పార్టీ వారు రణభేరి మోగించారు.
ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేసిన ఈ సంఘటనపై వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని కాంగ్రెస్ నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డికోరారు. ఇటీవల సిద్దిపేటలో పర్యటించిన చంద్రబాబు డబ్బుతో నిండిన సూట్ కేసులను తీసుకువెళ్ళారని వై.ఎస్. ఆరోపించడంతో సభలో గందరగోళం చెలరేగింది. అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది.అరుపులు, కేకలతో సభ దద్దరిల్లి పోయింది. సభలో ఏం జరుగుతున్నదోఅర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
ఈ క్రమలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని అనుమతించడం లేదంటూస్పీకర్ ప్రతిభా భారతి ప్రకటించారు. స్పీకర్ నిర్ణయంతో కాంగ్రెస్ వారు మరింత రెచ్చిపోయారు. వెల్ లోకి దూసుకు వచ్చారు.స్పీకర్ తో వాగ్వివాదానికి దిగారు. పరిస్థితి ఎంతసేపటికి అదుపులోకి రాకపోవడంతోఅసెంబ్లీ సమావేశాన్ని గంటసేపు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సభ ప్రారంభం కాగానే సిద్దిపేటలో ఎమ్మెల్ల్యేలపై జరిగిన దాడి గురించి ప్రకటన ఇచ్చేందుకు హోం మంత్రి దేవేందర్ గౌడ్ అంగీకరించడంతో సభ లో ప్రశాంతత నెలకొంది. ఆ తరువాత సభా కార్యక్రమాలు సజావుగా సాగాయి.