రాయల్ వెడ్డింగ్ రాసిన మరణశాసనం! చౌదరి కోసం అగర్వాల్ ప్రాణం తీసి..
అది జూన్ 18. పుణె సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం, చారిత్రాత్మక లోహగఢ్ కోట. గాలులు బలంగా వీస్తున్నాయి. అదే సమయంలో 26 ఏళ్ల కేతన్ విశాల్ అగర్వాల్ అనే యువకుడు దాదాపు 400 అడుగుల లోతైన లోయలోకి పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. కేతన్ తన మొబైల్లో ఫోటోలు తీసుకుంటూ కాలు జారి పడిపోయాడంటూ అతని కాబోయే భార్య సియా గోయల్ గుండెలు పగిలేలా ఏడ్చింది. పోలీసుల ప్రాథమిక విచారణలోనూ అది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగానే నమోదైంది. కానీ, ఆ కన్నీళ్ల వెనుక దాగున్న క్రూరత్వం కాస్త ఆలస్యంగా బయటపడింది.
పెళ్లి వేడుకల వేళ.. ప్రాణాలు తీసిన మోహం!
కేతన్ అగర్వాల్ పుణెలోని గహూంజే ప్రాంతానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార కుటుంబానికి చెందినవాడు. ఉన్నత విద్యావంతుడైన కేతన్కు, కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన సియా గోయల్కు కొద్దిరోజుల క్రితమే వివాహం నిశ్చయమైంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేయడానికి ఇరు కుటుంబాలు ఏర్పాట్లు కూడా మొదలుపెట్టాయి. అయితే, సియాకు అప్పటికే పుణెకు చెందిన చేతన్ బాబులాల్ చౌదరి (22) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. కేతన్ను పెళ్లి చేసుకోవడం సియాకు ఇష్టం లేదు. తమ ప్రేమకు కేతన్ అడ్డుగా మారాడని భావించిన ఆ కిరాతక ప్రేమికులు... ఎలాగైనా అతడిని ఈ లోకం నుంచి సాగనంపాలని వ్యూహం రచించారు.

పక్కా స్కెచ్.. కోటపైకి పిలిపించి మరీ..!
నిందితుల ప్లాన్ ప్రకారం... జూన్ 18న కేతన్ను లోహగఢ్ కోటకు రప్పించింది సియా. ఆ తర్వాత తన ప్రియుడు చేతన్ చౌదరిని కూడా అక్కడికే పిలిపించింది. ఎవరూ లేని సమయం చూసి, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న కేతన్ను ఇద్దరూ కలిసి బలంగా లోయలోకి తోసేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు సియా నాటకమాడింది. అయితే, పోలీసుల దర్యాప్తులో సియా ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమె కాల్ డేటాను, వ్యక్తిగత విషయాలను పరిశీలించారు. ఈ క్రమంలో ప్రియుడు చేతన్ చౌదరి గుట్టు రట్టయింది. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేతన్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, కేతన్ను తామే ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు సియా గోయల్ను కూడా అరెస్ట్ చేశారు.
తండ్రి కన్నీరు... బయటపడ్డ పాత కుట్రలు!
"నా కొడుకు శవాన్ని ఇంటికి తెచ్చినప్పుడు సియా ముఖంలో ఎలాంటి బాధ లేదు. ఆమె అస్సలు ఏడవలేదు" అంటూ కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ కన్నీరుమున్నీరయ్యారు. సియా కుటుంబమే కావాలని ఈ పెళ్లి సంబంధం తెచ్చిందని, వారి వెనుక పెద్ద కుట్ర ఉందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. గతంలో వీరంతా కలిసి బాలి ట్రిప్కు వెళ్తుండగా, లోనావాలా ఫుడ్ మాల్ దగ్గర సియా ఫోన్ తెచ్చుకుంటానని కారు దగ్గరికి వెళ్లి కేతన్ పాస్పోర్ట్ను దొంగిలించిందని, తద్వారా ఆ ట్రిప్ క్యాన్సిల్ అయ్యేలా చేసిందని ఆయన ఆరోపించారు.
ఆ రోజే చంపేయాలనుకున్నారు..!
"జూన్ 14న కూడా సియా నా కొడుకును అదే లోహగఢ్ కోటపైకి తీసుకెళ్లింది. అప్పుడు కూడా కేతన్ను తోసేయడానికి ప్రయత్నించగా, అతను పొదలను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడు కేతన్ నిలదీయగా.. అక్కడ పాము వచ్చిందని, నిన్ను కాపాడటానికే నెట్టేసానని సియా అబద్ధం చెప్పింది. అప్పుడే నా కొడుకును చంపడానికి ప్రయత్నించారని ఇప్పుడు అర్థమవుతోంది" అని కేతన్ తండ్రి పోలీసుల ఎదుట వాపోయారు.
ప్రస్తుతం లోనావాలా రూరల్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద హత్య, నేరపూరిత కుట్ర కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘోర కలికి వెనుక కేవలం ఈ ఇద్దరే ఉన్నారా? లేక సియా కుటుంబ సభ్యుల హస్తం కూడా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.














Click it and Unblock the Notifications