ఫలితాలు ఊహించినవే: బాబు
హైదరాబాద్: ఉప ఎన్నికల ఫలితాలు ఊహించినవేనని ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన ముక్తసరిగా స్పందించారు. సిద్ధిపేటలో తెలంగాణ రాష్ట్ర సమితి నేతకె. చంద్రశేఖర్ రావు, ఉయ్యూరులో తెలుగుదేశం అభ్యర్థి అన్నేవిజయలక్ష్మి గెలుపొందిన విషయం తెలిసిందే.
సిద్ధిపేట ప్రత్యేక తెలంగాణ అంశం పని చేసిందని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. అయితే ఉయ్యూరులో నైతికవిజయం తమదేనని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీది సాంకేతికవిజయం మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఉయ్యూరులో తెలుగుదేశం పార్టీ నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కేవలం 16వేల మెజారిటీతో గెలిచిందని, తమ బలంపెరిగిందని ఆయన అన్నారు.
తన విజయం తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక మైలురాయి అనికె. చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతానని ఆయన చెప్పారు. అయితే, మోసపూరిత మాటలు చెప్పి చంద్రశేఖర్ రావు గెలుపొందారని ఓటమిపాలైన తెలుగుదేశం అభ్యర్థి ఎం. శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
చంద్రశేఖర్ రావు విజయం తెలంగాణ వాదం బలాన్ని తెలియజేసిందని తెలంగాణ సాధన సమితి (టిఎస్ఎస్) కన్వీనర్ ఎ. నరేంద్ర అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ వాదానికి ఉన్న బలాన్ని గుర్తించాలని ఆయన తెలుగుదేశం, కాంగ్రెస్, బిజెపిలకు చెందిన తెలంగాణ నాయకులకువిజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ సిద్ధిపేటలో డబ్బులు పంచినా, పార్లమెంటు సభ్యులను, మంత్రులను, శాసనసభ్యులను దింపినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా టిఆర్ఎస్విజయం సాధించిందని ఆయన అన్నారు. సిద్ధిపేట ఫలితం తెలంగాణ ప్రజల మనోభావాన్ని తెలియజేసిందని ఆయన అన్నారు.