వందలాది సిపిఎం కార్యకర్తలఅరెస్టు
హైదరాబాద్: సచివాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించిన వందలాది మంది సిపిఎం నాయకులను, కార్యకర్తలను శనివారం పోలీసులుఅరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఎపిఎస్ఆర్టీసి) ఉద్యోగుల సమ్మెను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా వారు సచివాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఇంత వరకు ఆర్టీసి సమ్మెకు మద్దతు తెలియజేస్తున్న సిపిఎం దీంతో ప్రత్యక్ష ఆందోళనకు దిగినట్లయింది.
శనివారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో సిపిఎం కార్యకర్తలు సచివాలయాన్ని ముట్టడించడానికి పొట్టిశ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకున్నారు. వారు సచివాలయం వైపు దూసుకుపోవడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే పోలీసులు సిపిఎం కార్యకర్తలను, నేతలను అదుపులోకి తీసుకున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులుతో పాటు దాదాపు 300 మందిఅరెస్టయ్యారు.