బేషరతు చర్చలకు రెడీ: జెఎసి
హైదరాబాద్: ముందస్తు షరతులు ఏవీ లేకుండా ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధమేనని ఆర్టీసి కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి) నేతలు చెప్పారు. ఆర్టీసి కార్మికుల సమ్మె గురువారం 11వ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. రాష్ట్రంలోని పలు చోట్ల రాస్తారోకోలు, ర్యాలీలు, రిలే నిరహార దీక్షలు జరిగాయి. మహిళా సంఘాల, ట్రేడ్ యూనియన్ల సహకారంతో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని జెఎసి కన్వీనర్ బి. రామారావువిలేకరులకు చెప్పారు. ప్రయాణికులకు ఏ ఇబ్బందులు లేకుండా బస్సులను నడపగలుగుతున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటనను ఆయన ఖండించారు.
గంటూరు జిల్లా మంగళగిరి డిపో వద్ద కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్యాజువల్స్తో బస్సులను నడపడానికి చేసిన ప్రయత్నాన్ని ఆర్టీసి కార్మికులు అడ్డుకున్నారు. బయటకు వచ్చిన బస్సులపై కార్మికులు దాడి చేశారు. ఈ దాడిలో నాగరాజు అనే క్యాజువల్ కార్మికుడు గాయపడ్డాడు. క్యాజువల్ కార్మికులు పారిపోయారు. కర్నూలులో ఆర్టీసి కార్మికుల పిల్లలు ర్యాలీ నిర్వహించారు.వీరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తిరుపతిలో ప్రజా సంఘాల కార్యకర్తలు, ఆర్టీసి కార్మికుల కుటుంబ సభ్యులు ప్రదర్శన నిర్వహించారు.విశాఖపట్నంలో వామపక్షాల అనుబంధ విద్యార్థి, కార్మిక సంఘాలు ధర్నాలు చేశాయి.శ్రీకాకుళంలో ఆర్టీసి కార్మికులు అర్థనగ్న ప్రదర్శన చేశారు.












Click it and Unblock the Notifications