హైదరాబాద్: నక్సలైట్ల విధ్వంసం రాష్ట్రమంతావిస్తరించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా పోలీసు సూపరింటిండెంట్లు కూడా పాల్గొన్న కలెక్టర్ల సమావేశంలో ఆయన శుక్రవారం ఈ విషయాన్ని ప్రస్తావించారు. పీపుల్స్వార్ నక్సలైట్లు గురువారం రాత్రి, తెల్లవారుజామున రాష్ట్రంలో పలు చోట్ల విధ్వంసానికి పాల్పడడంపై ఆయన నుంచి ఈ ప్రతిస్పందన వచ్చింది. నక్సలైట్లు మొదట వ్యక్తులను హత్య చేశారని, ఇప్పుడు ఫ్యాక్టరీలపై దృష్టి సారించారని, ఇంతకు ముందు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన నక్సలైట్లు ఇప్పుడు రాష్ట్రమంతా విస్తరించారని ఆయన అన్నారు. ఆ రకంగా నక్సలైట్లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు.
తీవ్రవాదం వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని, రాష్ట్రాభివృద్ధి జరగడం లేదని ఆయన అన్నారు. శాంతిభద్రతలు సక్రమంగా వుంటేనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. ఎస్పిలు, కలెక్టర్లు జిల్లాల్లో సమన్వయంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. ప్రజల్లో అసహనం, అశాంతి పెరగక ముందే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పిల మధ్య సమన్వయలోపం, విభేదాలున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. న్యాయం జరగకపోతే, తామే చేసిందే సరైందనే నిర్హేతుక నిర్ణయానికి వస్తే అసంతృప్తి చోటు చేసుకుంటుందని, ఈ విధమైన అసంతృప్తి లేకుండా కలెక్టర్లు, ఎస్పిలు వ్యవహరించాలని ఆయన అన్నారు.
అధికారులపై ఆగ్రహం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారంనాడు పంచాయతీరాజ్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీటి పథకాలకు సంబంధించి సరైన లెక్కలు అందజేయలేదని ఆయన అధికారులపై మండిపడ్డారు. ఈ విషయమై ఒక అధికారి వివరణ ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు- నేను వాదనకు సిద్ధంగా లేను అని ఆయన అన్నారు. తనకు ఇచ్చినవి పాత లెక్కలని, కంప్యూటరైజేషన్ అందుబాటులోకి వచ్చినా, టెలీ కాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి తాను చెప్పుతున్నా పట్టించుకోవడం లేదని, పాత గణాంక వివరాలు ఇచ్చారని ఆయన అన్నారు.
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో లక్ష్యాలను సాధించకపోవడం పట్ల ఆయన కలెక్టర్లపై మండిపడ్డారు. 18 లక్షల మరుగుదొడ్లు ఎందుకు పూర్తి చేయలేకపోయారనిఆయన అడిగారు. నిధులు లేవని చెప్పుతున్నారని, తనకు ఆ విషయం చెప్పి వుంటేతాను నిధులు విడుదల చేసేవాడినని ఆయన అన్నారు. ఎన్నిసార్లు చెప్పినా మంత్రి గానీ, అధికారులు గానీ ఈ విషయంలో తనను అర్థం చేసుకోవడం లేదని ఆయన అన్నారు. అధికారులు ప్రభుత్వ బాధ్యతలను విస్మరిస్తుండడం పట్ల చంద్రబాబు నిప్పులు కక్కారు.
విజన్ 2020 తరహాలో జిల్లాలవారీగా విజన్లు రూపొందించాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. పన్నుల వసూళ్లలో చొరవచూపాలని కూడా ఆయన కోరారు. ప్రజలపై అదనపు పన్నులు వేయడం కన్నా పన్నుల వసూళ్లలో లోపాలను, వైఫల్యాలను రూపుమాపి ప్రభుత్వాదాయన్ని పెంచడానికి కలెక్టర్లు కృషి చేయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications