పవన్ సర్జరీ వెనుక అసలు కారణం ఇదే.. వెలుగులోకి మరో ఆరోగ్య సమస్య!
ప్రముఖ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలకు తెరపడింది. ఇటీవల ఆయనకు అకస్మాత్తుగా శస్త్రచికిత్స జరగడంతో అభిమానులు ఆందోళన చెందారు. తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ను హైదరాబాద్లోని ఆయన నివాసంలో పరామర్శించిన సందర్భంగా తన అనారోగ్యానికి గల కారణాలను పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా తీవ్రమైన సైనస్ సమస్యతో బాధపడుతున్నారు. ముందుగా దీనిని సాధారణ సమస్యగా భావించినప్పటికీ.. క్రమంగా ఇన్ఫెక్షన్ కళ్ల వరకు వ్యాపించడంతో పరిస్థితి విషమించింది. దీంతో వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయాలని సూచించారు. ఏప్రిల్ 18న హైదరాబాద్లో ఆయనకు 'ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ' నిర్వహించారు. ముక్కు రంధ్రాల ద్వారా బ్లాకేజీలను తొలగించే ఈ ప్రక్రియలో బయట ఎటువంటి కోతలు లేకుండానే చికిత్స పూర్తయింది.

ఆపరేషన్ తర్వాత మరో ఇబ్బంది
శస్త్రచికిత్స తర్వాత పవన్ కళ్యాణ్కు ముక్కు నుంచి స్వల్పంగా రక్తస్రావం అవుతున్నట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం వెల్లడించింది. అయితే ఇది సహజమేనని.. వారం రోజుల్లో అంతా సర్దుకుంటుందని వెద్యులు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం పవన్ కోలుకుంటున్నారని.. వైద్యుల సలహా మేరకు మరో 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు.
పాత గాయాల కొత్త నొప్పి.. మరో సర్జరీ తప్పదా?
సైనస్ సర్జరీ కోలుకుంటున్న తరుణంలోనే పవన్కు మరో పాత ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతోంది. గతంలో సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు తగిలిన గాయాలకు ఆ సమయంలో సరైన చికిత్స అందలేదు. ఇప్పుడు ఆ గాయాల వల్ల ఆయన భుజం నొప్పితో బాధపడుతున్నారు. గత ఐదేళ్లుగా ఆయన భుజం కండరాలు దెబ్బతిన్నాయని, దీని వల్ల పవన్ నిత్యం అసౌకర్యానికి గురవుతున్నారని వైద్యులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ సమస్య తీవ్రతరం కాకుండా ఉండాలంటే భుజానికి కూడా శస్త్రచికిత్స చేసే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ సినిమాల్లోనూ తన జోరును కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications