కాంగ్రెస్ ను వీడని అసమ్మతి పీడ
హైదరాబాద్ః మినీ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అసమ్మతి పీడ వదల్లేదు. హైదరాబాద్ కార్పొరేషన్ సీట్ల పంపకంలో ముషీరాబాద్ నియోజక వర్గంలో తనకు అన్యాయం జరిగిందంటూ సి.ఎల్.పి.మాజీ కార్యదర్శి, కోట్ల అనుచరుడు కోదండ రెడ్డి గాంధీభవన్ ఎదుట ధర్నాకు దిగి సంచలనం సృష్టించారు. ముషీరాబాద్ లోని కొన్ని డివిజన్లలో ముక్కూముఖం తెలియని వ్యక్తులకు టిక్కెట్లు ఇచ్చారని ఆరోపిస్తూ ఆయన నాలుగు గంటల పాటు గాంధీభవన్ లో ధర్నా జరిపారు. చివరకు పార్టీ మేయర్ అభ్యర్థి దానం నాగేందర్ స్వయంగా గాంధీభవన్ వచ్చి కోదండరెడ్డికి సర్దిచెప్పారు.
నగరానికి చెందిన మరో సీనియర్ నాయకుడు పిట్ల కృష్ణ కూడా నాగేందర్ కు టిక్కెట్ ఇవ్వడం పట్ల అసంతృప్తితో వున్నారు. నాగేందర్ ఊరేగింపులో పాల్గొనకుండా గాంధీభవన్ వచ్చి కోదండరెడ్డిని పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలెవరూ దానం నాగేందర్ వెంటలేరనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మినీమునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న రాజమండ్రి, తిరుపతి, హిందూపూర్ లలో కూడా కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు పెరుగుతున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications
