మాతో కలిస్తే జీరో టారిఫ్- బలవంతుడిదే రాజ్యం కాకూడదు: జిన్పింగ్ 5 ప్రతిపాదనలు
దేశ రాజధాని వేదికగా కొనసాగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మిట్ సందర్భంగా చైనా అయిదు ప్రతిపాదనలను ప్రవేశపెట్టింది. బ్రిక్స్ ను మరింత క్రియాశీలక శక్తిగా మార్చడానికి ఉద్దేశించిన వ్యూహాత్మక ప్రణాళికలు ఇవి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించిన బ్రిక్స్ సెషన్ 2లో చైనా విదేశాంగ ప్రతినిధుల బృందం దీన్ని ప్రతిపాదించింది. సభ్య దేశాల అభివృద్ధికి తోడ్పడేలా అయిదు ప్రతిపాదనలు రూపొందాయి. జిన్ పింగ్ ప్రసంగ పాఠం ఇది. దీని ఫుల్ టెక్స్ట్ ను చైనా విడుదల చేసింది.
దీని ప్రకారం.. అంతర్జాతీయ నియమ నిబంధనలు లేని ప్రపంచం ఓ ట్రాఫిక్ సిగ్నల్ లేని చౌరస్తా లాంటిదని, అక్కడ తీవ్ర గందరగోళం ఏర్పడటం ఖాయమని షీ జిన్పింగ్ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా సమానత్వం, న్యాయం అందరికీ దక్కాలనేదే ప్రతి ఒక్కరి ఆకాంక్ష అని పేర్కొన్నారు. అంతర్జాతీయ నియమాలను ప్రపంచ దేశాలన్నీ కలిసి సంయుక్తంగా రూపొందించాలే తప్ప, కొన్ని శక్తులు మాత్రమే శాసించకూడదని స్పష్టం చేశారు. బలవంతుడిదే రాజ్యం.. అనే ఆలోచనకు కాలం చెల్లిందని, ఆ పద్ధతిని వీడాలని పిలుపునిచ్చారు.

ఆర్థిక ప్రగతిని సాధించడంలో భాగంగా తమ మార్కెట్ ను మరింతగా స్వేచ్ఛా శైలిలో విస్తరిస్తోన్నామని జిన్ పింగ్ వెల్లడించారు. తమతో అధికారిక దౌత్య సంబంధాలు కలిగి ఉన్న 53 ఆఫ్రికా దేశాల ఉత్పత్తులకు ఎటువంటి కస్టమ్స్ టారిఫ్ లేకుండా చైనా మార్కెట్లోకి అనుమతించే జీరో టారిఫ్ వాణిజ్య సదుపాయాన్ని కల్పించినట్లు ప్రకటించారు. ఆఫ్రికా దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచంలోని ఇతర పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలతో కూడా అవకాశాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, ఉమ్మడి ప్రయోజనాల కోసం ఏకపక్ష స్వేచ్ఛా వాణిజ్య విధానాలను మరింత వేగంగా విస్తరిస్తామని ఆయన స్పష్టం చేశారు.
సభ్య దేశాల ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల, అంతర్జాతీయ స్థిరత్వానికి బ్రిక్స్ ఎంతగానో దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అంతర్జాతీయ వేదికలపై చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా గ్లోబల్ సౌత్ దేశాలన్నీ కూడా ఏకతాటి పైకి రావాల్సిన అవసరం ఉందని, సానుకూల ప్రయోజనాల కోసం స్వీయ చొరవను తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒకే సార్వభౌమత్వ విధానాలకు పరిమితం కాకుండా విభిన్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని బహుళ ధృవ ప్రపంచ నిర్మాణంలో బ్రిక్స్ పాత్రను సుస్థిరం చేయాలని సూచించారు.
ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యతను జిన్పింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇందులో భాగంగా మొదటి ప్రతిపాదనగా ఓపెన్ సోర్స్ ఐటీ ఏఐ ఇనిషియేటివ్ ను ప్రకటించారు. దీని ద్వారా బ్రిక్స్ ఏఐ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీని స్థాపించి సభ్య దేశాల్లో అధునాతన లాంగ్వేజ్ మోడల్స్ అభివృద్ధికి సహకారం అందించాలి. రెండో ప్రతిపాదనగా వాణిజ్యం, పెట్టుబడుల సౌలభ్యం కోసం ప్రత్యేక ఆర్థిక మండలి భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా నూతన పారిశ్రామిక ఐక్యవేదికను నిర్మించాలని సూచించారు.
డిజిటల్ ఫైనాన్స్ సిస్టమ్ ను ప్రోత్సహించడంలో భాగంగా బ్రిక్స్ డిజిటల్ ఎకోసిస్టమ్ క్లౌడ్ ప్లాట్ఫారమ్ ను నిర్మిస్తామని జిన్పింగ్ హామీ ఇచ్చారు. దీని పరిధిలో సభ్య దేశాల ప్రతినిధులకు డిజిటల్ నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడం, ఆధునిక టెక్నాలజీ మార్పిడిని సాగించడం వంటివి మూడో ప్రతిపాదనగా పేర్కొన్నారు. సంప్రదాయ పరిశ్రమల రూపురేఖలను మార్చి వాటిని ఆధునీకరించడానికి వీలుగా స్మార్ట్ ఫ్యాక్టరీల నిర్మాణంలో పరస్పర సాంకేతిక ప్రమాణాలను మెరుగుపర్చాలనేది నాలుగో ప్రతిపాదనగా ఆయన వివరించారు.
అయిదో ప్రతిపాదన కింద.. విద్యా, పరిశోధన రంగాల్లో నూతన మార్పుల కోసం బ్రిక్స్ ఇంజినీర్ కల్టివేషన్ అలయన్స్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇది సభ్య దేశాల యువ ఇంజనీర్ల నైపుణ్య ప్రమాణాలను పరస్పరం గుర్తించడానికి, శాస్త్రీయ పరిశోధన మార్పిడి కార్యక్రామాలను వేగవంతం చేయడానికి సహాయపడుతుందని వ్యాఖ్యానించారు. ఇటువంటి ఆలోచనల ద్వారా మాత్రమే సభ్య దేశాలలో సాంకేతిక ప్రతిభ పెంపొందుతుందని, మానవ వనరుల వినియోగం సమర్థవంతంగా సాగుతుందని అన్నారు.














Click it and Unblock the Notifications
