ఇస్లామాబాద్ః శనివారం సాయంత్రం తమ దేశ ప్రజలను ఉద్దేశించి చేయనున్న ప్రసంగం పాఠాన్ని పాక్ అధినేత ముషారఫ్ స్వయంగా తయారు చేసుకున్నారు. శనివారం నాడు రోజంతా ఆయన ఈ ప్రసంగం రాసుకోవడంలో బిజీగా వున్నట్టు అధికారవర్గాలు చెప్పాయి.
టెర్రరిజాన్ని అణిచివేయడానికి తమ ప్రభుత్వం తీసుకోనున్న చర్యలను ప్రజలకు వివరించడం ప్రధాన ఉద్దేశ్యంగా ఆయన ఈ ప్రసంగం చేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు ఈ ప్రసంగాన్ని ప్రసారం చేస్తున్నారు. ఇదిలా వుండగా ముషారఫ్ ప్రసంగం కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. పాకిస్తాన్లో ముందు జాగ్రత్త చర్యగా పెద్దఎత్తున తీవ్రవాద సంస్థలతో సంబంధం వున్నవారిని అరెస్టు చేశారు. సుమారు రెండువందల మందిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రవాదులు, తీవ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపే విషయం ప్రకటించినప్పటికీ ముషారఫ్ కాశ్మీర్ విషయంలో మాత్రం బాణీ మార్చకపోవచ్చని అంటున్నారు.