Home
Posted on 24-11-03
మహబూబ్నగర్: కల్లబొల్లి కబుర్లు చెప్పడం మానాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నాయకులకు సలహా ఇచ్చారు. మహబూబ్నగర్ జిల్లా నారాయణఖేడ్ మండలం నవాబుపేట గ్రామంలో ఆయన సోమవారం చదువుల పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆచరణసాధ్యం కాని హామీలు ఇస్తూ రాజకీయ లబ్ధి పొందడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయనవిమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతులకు ఉచితంగావిద్యుత్ అందించడం లేదని, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉచితవిద్యుత్ హామీని ఇవ్వడం లేదని, ఆంధ్రప్రదేశ్ నాయకులు మాత్రమే ఉచితవిద్యుత్ హామీని ఇవ్వడం రాజకీయ లబ్ధి పొందడానికేనని ఆయన అన్నారు.పేదరిక నిర్మూలనకు ఏ రాష్ట్రం కూడా ఖర్చు చేయనంతగా నిధులను ఖర్చు చేశామని, ఫలితాలు కూడా అదే విధంగా సాధించామని ఆయన చెప్పారు.
అనంతరం ఆయన కొందరు పిల్లలతో ముచ్చటించారు. వారు బడికి వెళ్తున్నదీ, లేనిదీ అడిగితెలుసుకున్నారు. బడికి వెళ్లడం లేదని చెప్పిన పిల్లలు ఎందుకు బడికి వెళ్లడం లేదో అడిగితెలుసుకున్నారు. బడికి పంపకుండా పిల్లలతో పని చేయించేవారికి దండన తప్పదని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications
