దెబ్బతిన్న తిరుమల మహాద్వార గోపుర విగ్రహం: టీటీడీ ఏం చెప్పిందంటే..
తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వార గోపురంపై ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం దెబ్బతిన్న ఘటన భక్తుల్లో ఆందోళనలను రేపింది. బ్రహ్మోత్సవాలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఘటన వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీటి సన్నాహకాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన తనిఖీల సందర్భంగా ఈ విగ్రహం దెబ్బతిన్నట్లు టీటీడీ అధికారులు గుర్తించారు. వెంటనే మరమ్మతు పనులను ప్రారంభించారు.
మహాద్వార గోపురం పైభాగంలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం చేయి విరిగినట్లుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడానికి వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఈ అంశం భక్తులలో తీవ్ర ఆందోళన కలిగించింది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ విగ్రహం దెబ్బతిందంటూ ఆరోపణలు రావడంతో టీటీడీ వెంటనే స్పందించి క్లారిటీ ఇచ్చింది.

అధికారుల నిర్లక్ష్యం వల్ల విగ్రహం దెబ్బతిందనే ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని టీటీడీ వివరణ ఇచ్చింది. బ్రహ్మోత్సవాల ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఆలయ గోపురాలను నిశితంగా పరిశీలిస్తున్న క్రమంలోనే ఈ దెబ్బతిన్న శ్రీకృష్ణుడి విగ్రహాన్ని కనుగొన్నట్లు తెలిపింది. ఆలయ సువర్ణ గోపురం, మహాద్వార గోపురాలపై వందలాది సున్నితమైన శిల్పాలు ఉన్నాయని, ఇవి నిరంతరం ఎండ, వాన వంటి కఠినమైన ప్రకృతి వాతావరణ పరిస్థితులకు గురవుతుంటాయని పేర్కొంది.
ఇలాంటి విగ్రహాలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ అవసరమైన చోట తక్షణ పునరుద్ధరణ పనులు చేపడుతుంటామని టీటీడీ వివరించింది. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు ఆలయ గోపురాలకు పెయింటింగ్ వేయడం, దెబ్బతిన్న దేవతా మూర్తుల శిల్పాలను నిపుణులైన శిల్పులతో పునరుద్ధరించడం ఆలయ ఆనవాయితీగా వస్తోందని, విగ్రహాలు దెబ్బతిన్న తీవ్రతను బట్టి వాటికి శాస్త్రోక్తంగా మరమ్మతులు చేయడం లేదా వాటి స్థానంలో నూతన విగ్రహాలను ప్రతిష్టిస్తుంటామని టీటీడీ పేర్కొంది.
దీనిపై సోషల్ మీడియా వేదికగా సాగుతున్న తప్పుడు ప్రచారాలు, వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. ఇలాంటి తప్పుడు వార్తల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తులలో అనవసరమైన భయాందోళనలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ఆలయ పవిత్రతను కాపాడటానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించింది.














Click it and Unblock the Notifications
