యన్యస్యస్ కుంభకోణం: గణాంకాధికారి అరెస్టు
హైదరాబాద్: జాతీయ సేవా పథకం (యన్యస్యస్)లో భారీ కుంభకోణం బయటపడింది. విద్యార్థులకు దక్కాల్సిన నిధుల్లో 82 లక్షల రూపాయలు దిగమింగిన గణాంకాధికారి కె. పుల్లారెడ్డిని సి ఐడి అధికారులు అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో ఉన్నత విద్యాశాఖాధికారులకు, బ్యాంక్ మేనేజర్కు ప్రమేయం ఉన్నట్లు సి ఐడి అధికారులు అనుమానిస్తున్నారు.
సచివాలయంలో ఉన్న యన్యస్యస్ కార్యాలయంలో ఈ కుంభకోణం వెలుగు చూసింది. యన్యస్యస్ కార్యకలాపాల కోసం విడుదలైన 4 కోట్ల రూపాయల్లో 3 కోట్ల 18 లక్షల రూపాయలు విద్యార్థుల కోసం విడుదల చేసి, మిగతా 82 లక్షల రూపాయలు వ్యక్తిగత అవసరాల కోసం డ్రా చేసుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది. 158 రికార్డులను పరిశీలించి, 26 మంది సాక్షులను విచారించి ప్రాథమిక సాక్ష్యాధారాలు సంపాదించి పుల్లారెడ్డిని అరెస్టు చేశామని సి ఐడి అధికారులు చెప్పారు.
ఈ కుంభకోణంలో తానొక్కడినే లేనని పుల్లారెడ్డి అంటున్నాడు. కుంభకోణం జరిగిన మాట వాస్తవమేనని, అయితే మొత్తం కుంభకోణానికి తానొక్కడే కారణం కాదని, ఇందులో ఇతరులు కూడా ఉన్నారని ఆయన చెప్పాడు.